
- రూ.40 లక్షలు వసూలు చేసిన వ్యక్తిపై కేసు నమోదు
జీడిమెట్ల, వెలుగు: సాఫ్ట్వేర్ కంపెనీల్లో బ్యాక్ డోర్ ద్వారా జాబ్లు ఇప్పిస్తానని నమ్మించి పలువురి నుంచి డబ్బులు వసూలు చేసిన వ్యక్తిపై జగద్గిరిగుట్ట పీఎస్లో కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని కృష్ణా జిల్లా నారాయణ లంక మండలం భవధారపల్లికి చెందిన మలిశెట్టి గోపిచంద్ సిటీకి వచ్చి అల్విన్ కాలనీలో ఉంటున్నాడు. సోమాజిగూడలోని క్వాంట్ క్లౌడ్ సొల్యూషన్లో బ్యాక్ డోర్ ద్వారా జాబ్ ఇప్పిస్తానని స్థానికంగా ఉండే దూరపు బంధువు బన్రెడ్డి వెంకట Sనాగపూర్ణ కిశోర్ను గోపిచంద్ నమ్మించాడు.
ఇందుకోసం కిశోర్ నుంచి ఈ ఏడాది అక్టోబర్లో రూ.2 లక్షల 30 వేలు తీసుకున్నాడు. ఇలా గోపిచంద్ మరికొందరిని నమ్మించి సుమారు రూ.40 లక్షలు వసూలు చేశాడు. వారికి ఆన్లైన్ ద్వారా ఇంటర్వ్యూలు నిర్వహించి గత నెల 21న జాయినింగ్ డేట్ అని పేర్కొంటూ ఆఫర్ లెటర్లు సైతం ఇచ్చాడు. అయితే, బాధితులు సదరు కంపెనీ అడ్రెస్కు వెళ్లగా.. అక్కడ ఎలాంటి ఆఫీసు లేదని తెలిసింది. మోసపోయినట్లు గుర్తించిన బాధితులు గోపిచంద్పై జగద్గిరిగుట్ట పోలీసులకు కంప్లయింట్ చేశారు. పోలీసులు కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేపట్టారు.