
దహెగాం, వెలుగు: వడ్ల కొనుగోలు కేంద్రం నిర్వాహకులు వేయింగ్ మెషీన్ లో బరువు తక్కువ చూపేలా సెట్ చేసి దోపిడీకి పాల్పడుతున్నారని ఆరోపిస్తూ రైతులు ఆందోళన చేపట్టారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా దహెగాం మండలం ఒడ్డుగూడ ధాన్యం కొనుగోలు సెంటర్ వద్ద వేయింగ్ మెషీన్లో బస్తాను కాంటా చేయగా, మొదట 41 కిలోలు వచ్చింది. అనుమానించిన రైతులు.. కాంటాను సెట్ చేసి మళ్లీ జోకగా, అదే బస్తా 42 కిలోలు వచ్చింది.
దీంతో సెంటర్ నిర్వాహకులను రైతులు నిలదీశారు. కాంటాలో సెట్టింగ్ మార్చి కేజీ తక్కువగా చూపించేలా చేశారని మండిపడ్డారు. తమకు న్యాయం చేయాలని సెంటర్ వద్ద ఆందోళనకు దిగారు. ఈ విషయంపై కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. సెంటర్ లో వడ్ల కాంటాలో తేడాలు ఉన్నట్లు, గతంలో వడ్లు అమ్మిన రైతులు సైతం ఆరోపించారు. ప్రైవేట్ వ్యాపారులను నమ్మకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన సెంటర్కు తీసుకొస్తే ఇలా మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.