నిరుపేద స్టూడెంట్లకు ఫ్రీ ఎంసెట్​ కోచింగ్

నిరుపేద స్టూడెంట్లకు ఫ్రీ ఎంసెట్​ కోచింగ్
  • ఇంటర్  విద్యార్థులకు ఆరు నెలలుగా శిక్షణ ఇప్పించిన ఎమ్మెల్యే యెన్నం
  • పూర్తయిన క్లాసులు, 29 నుంచి ఎంట్రెన్స్
  • ఫ్రీ కోచింగ్ తో 200 మంది స్టూడెంట్లకు లబ్ధి

మహబూబ్​నగర్, వెలుగు: పాలమూరు జిల్లాలో విద్యాభివృద్ధికి బాటలు పడుతున్నాయి. నిరుపేద కుటుంబాలకు చెందిన పిల్లలు ఉన్నత చదువులు చదివేలా మహబూబ్​నగర్​ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్​ రెడ్డి ఫ్రీ కోచింగ్​ సెంటర్లను ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోనే మొదటిసారి మహబూబ్​నగర్​లోని ప్రభుత్వ జూనియర్​ బాయ్స్, గర్ల్స్​ కాలేజీల్లో నీట్, ఐఐటీలో ఇంట్రెస్ట్​ ఉన్న స్టూడెంట్లకు లాంగ్​ టర్మ్​ కోచింగ్​ ఇప్పించారు. గత నెలలోనే కోచింగ్  పూర్తయినప్పటికీ, పోటీ పరీక్షల్లో ఉత్తమ మార్కులు సాధించాలనే టార్గెట్​తో 45 రోజుల క్రాష్​ కోర్సును గత నెల 22 నుంచి ప్రారంభించారు. ఈ నెల 26 వరకు ఈ కోర్సు పూర్తి చేయించారు. కోచింగ్​ పూర్తి చేసుకున్న విద్యార్థులు పోటీ పరీక్షల్లో సత్తా చాటుతామని ఎమ్మెల్యే ధీమా వ్యక్తం చేశారు.

లాంగ్​ టర్మ్​ కోచింగ్..

పాలమూరులోని ప్రభుత్వ బాయ్స్, గర్ల్స్​ జూనియర్​ కాలేజీల్లో మహబూబ్​నగర్, నారాయణపేట, జడ్చర్ల, గద్వాల, వనపర్తి, నాగర్​కర్నూల్, ఖిల్లాఘణపురం తదితర ప్రాంతాలకు చెందిన వెయ్యి మందికి పైగా ఎంపీసీ, బైపీసీ సెకండ్​ ఇయర్ స్టూడెంట్లు ఉన్నారు. వీరిలో ఎంసెట్​ రాసేందుకు 200 మంది ఇంట్రెస్ట్​ చూపారు. వీరంతా వ్యవసాయ కూలీలు, రోజువారీ కూలీల కుటుంబాలు కావడంతో ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్​రెడ్డి వీరికి ఎంసెట్  ఫ్రీ కోచింగ్​ ఇప్పిస్తున్నారు. 

ఈ కోచింగ్​ను గత ఏడాది ఆగస్టు 22న ప్రారంభించగా.. స్థానిక రిషి, ప్రతిభ జూనియర్​ కాలేజీలకు చెందిన ఫ్యాకల్టీతో బాలురు, బాలికలకు వేర్వేరుగా క్లాసులు చెప్పించారు. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, జువాలజీ తదితర సబ్జెక్టుల్లో కంప్లీట్​ చేసిన సిలబస్​పై ప్రతి ఆదివారం వీక్లీ టెస్టులు నిర్వహించారు. కోచింగ్​ తీసుకున్న వారికి రూ.8 వేల మెటీరియల్​ను ఫ్రీగా అందించారు. 

45 రోజుల క్ర్యాష్​ కోర్సు..

ఎంసెట్​ కోచింగ్​ పూర్తయిన తరువాత స్టూడెంట్లు ఇంటర్​ పరీక్షలు రాశారు. అయితే ఇండ్లకు వెళ్తే సబ్జెక్ట్​ మరిచిపోతారనే ఆలోచనతో ఎమ్మెల్యే వీరికి 45 రోజుల క్రాష్​ కోచింగ్​ ఇప్పించారు. ఈ కోచింగ్​ గత నెల 22న ప్రారంభించారు. 110 మంది ఈ కోచింగ్​ తీసుకున్నారు. ఎక్కువ మంది స్టూడెంట్లు స్థానికేతరులు​ కావడంతో 30 మంది బాయ్స్​కు స్థానిక షాషబ్​ గుట్ట వద్ద ఉన్న ప్రభుత్వ ఎస్సీ హాస్టల్​లో, 70 మంది బాలికలకు స్థానిక తెలంగాణ చౌరస్తాలో ఉన్న బీసీ హాస్టల్​లో ఉండేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ రెండు హాస్టల్స్​లో హాలిడేస్​ ఉండడంతో ఎమ్మెల్యే తన నిధులు సమకూర్చి స్టూడెంట్లకు భోజనం సమకూర్చారు. స్టూడెంట్లతో చదివించేందుకు గర్ల్స్​ కాలేజీకి చెందిన కవిత, నరేశ్, బాయ్స్​ కాలేజీకి చెందిన శశికళ, రవిని కేర్  టేకర్లుగా ఏర్పాటు చేశారు.

 వారికి సెలవులు ఉన్నా ఎమ్మెల్యే రిక్వెస్ట్​తో డ్యూటీలు చేస్తున్నారు. ప్రతి వారం ఈ సెంటర్​ను ఎమ్మెల్యే విజిట్​ చేసి స్టూడెంట్లకు మోటివేషన్​ క్లాసులు ఇస్తూ వారిలో ధైర్యం నింపారు. శనివారం ఈ కోచింగ్​ పూర్తయింది. పూర్తయిన సిలబస్​పై స్థానిక జేపీఎన్​సీఈ కాలేజీలో మధ్యాహ్నం మాక్​ టెస్ట్​ నిర్వహించారు. ఈ సెంటర్​ను ఎమ్మెల్యే విజిట్​ చేసి సంతృప్తి వ్యక్తం చేశారు.

పాలమూరు పేరు నిలబెట్టాలె..

పాలమూరు  జిల్లాలోని ప్రతి నిరుపేదకు ఉన్నత విద్యను అందించాలన్నదే నా తపన. చాలా మంది పిల్లలకు ఎంసెట్​ రాయాలనే కోరిక ఉన్నా, కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ప్రైవేట్​ కోచింగ్​ సెంటర్లకు వెళ్లలేక దూరంగా ఉంటున్నారు. గవర్నమెంట్​ కాలేజీల్లో చదువుతున్న వారిని ఎంపిక చేసి ఫ్రీ కోచింగ్​ క్లాసులు చెప్పించా. ఎంసెట్​లో ర్యాంకులు సాధిస్తారనే నమ్మకం ఉంది. రిజల్ట్స్​లో పాలమూరు పేరు నిలబెడితే అంతకన్నా ఆనందం ఏం ఉంటుంది.- యెన్నం శ్రీనివాస్​ రెడ్డి, ఎమ్మెల్యే

ఎంసెట్​ రాయకపోతుంటి..

మా నాన్న కేశవులు. రోజు వారి కూలీ. ఆయన పనికి పోయి వస్తేనే మా ఇంట్లో అందరం తింటాం. అలాంటిది నేను ప్రైవేట్​లో ఎంసెట్​ కోచింగ్​ తీసుకోవడం సాధ్యమయ్యది కాదు. ఎమ్మెల్యే సార్​ మా కలలను సాకారం చేశారు. ఎంట్రెన్స్​లో ర్యాంక్​ సాధిస్తా.- వనజ, బైనల్లీపూర్తె

తెలుగు, ఇంగ్లీష్​లో క్లాసులు..

మా నాన్న ఖదీర్. ఆయన రైతు. ఎంసెట్​ రాసి మంచి ర్యాంక్​ సాధించాలని ఉన్నా, ప్రైవేట్​లో కోచింగ్​ తీసుకోవాలంటే రూ.లక్ష వరకు ఫీజ్​ ఉంది. ఎమ్మెల్యే యెన్నం సార్​ ఏర్పాటు చేసిన ఎంసెట్​ ఫ్రీ కోచింగ్​ సెంటర్​లో జాయిన్​ అయ్యా. ఇంగ్లీష్, తెలుగు మీడియంలో క్లాసులు చెప్పారు. డౌట్స్​ ఉంటే ఫ్యాకల్టీని అడిగి క్లియర్​ చేసుకున్నాను. - ముబషీర్, ఖిల్లాఘణపురం, వనపర్తి జిల్లా