
- ఎదురుచూస్తున్న ‘బీసీ’ అభ్యర్థులు
- ఏప్రిల్ 21నే ప్రారంభిస్తామని సర్కారు ప్రకటన
- ఎగ్జామ్ పెట్టి, రిజల్ట్స్ ఇచ్చి వదిలేశారు
- ఒక్క గ్రూప్ వన్కు మాత్రమే కోచింగ్ స్టార్ట్
- పత్తాలేని గ్రూప్ 2, ఎస్ఐ, కానిస్టేబుల్ శిక్షణ
హైదరాబాద్, వెలుగు: బీసీ స్టడీ సర్కిల్స్లో ఫ్రీ కోచింగ్ ఇంకా మొదలుకాలేదు. గ్రూప్–2, ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలకు పోటీపడే అభ్యర్థులు కోచింగ్ కోసం ఎదురుచూస్తున్నారు. ఏప్రిల్21 నుంచే కోచింగ్ ప్రారంభం అవుతుందని సర్కారు గొప్పగా ప్రచారం చేసుకున్నా అమలులో మాత్రం ముందుకుపడడం లేదు. అసలు కోచింగ్ ఉంటుందా? ఉండదా? అనే అనుమానం అభ్యర్థుల్లో కలుగుతోంది. ప్రభుత్వం భర్తీ చేస్తానన్న 80 వేల పైచిలుకు పోస్టుల్లో 30 వేల ఖాళీలకు ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఇటీవల గ్రూప్ 1, పోలీస్, ఎక్సైజ్కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్ రిలీజైంది. మరికొన్ని రోజుల్లో అప్లికేషన్లు తీసుకోనున్నారు. అయితే పేద అభ్యర్థులకు ఫ్రీ కోచింగ్ ఇవ్వాలని వివిధ సంక్షేమ శాఖలు నిర్ణయించాయి. బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో 16 స్టడీ సర్కిళ్లు, 105 స్టడీ సెంటర్ల ద్వారా లక్షా 25 వేల మందికి ఫ్రీ కోచింగ్ ఇస్తామని సర్కారు ప్రకటించింది. దీనికి సంబంధించి గత నెల 16న ఆన్లైన్ ఎగ్జామ్ నిర్వహించి అదే రోజు ఫలితాలు ఇచ్చారు.
ఏప్రిల్ 21నే ప్రారంభించాల్సి ఉన్నా..
ఫ్రీ కోచింగ్ గత నెల 21వ తేదీ నుంచే ప్రారంభం కావాల్సి ఉంది. కానీ ఇప్పటివరకు ఒక్క గ్రూప్ 1కే ఒక్కో స్టడీ సర్కిల్లో 100 మందికి క్లాసులు జరుగుతున్నాయి. గ్రూప్ 2, ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు ఇంకా క్లాసులు ప్రారంభించలేదు. ఫ్రీ కోచింగ్కు 50 కోట్లు ఖర్చు చేయనున్నట్లు సర్కారు ప్రకటించింది. అభ్యర్థులకు స్టైఫండ్ కూడా ఇస్తామని తెలిపింది. గ్రూప్ 1 అభ్యర్థులకు ఆరు నెలల పాటు రూ. 5 వేలు, ఇతర అభ్యర్థులకు మూడు నెలలపాటు రూ. 2 వేల చొప్పున ఇస్తామని చెప్పింది. అయితే ఈ మొత్తాన్ని కేవలం బీసీ స్టడీ సర్కిళ్లలో కోచింగ్ తీసుకునే వారికే ఇస్తామని అధికారులు చెబుతున్నారు. అందులోనూ బుక్స్కు పోగా మిగిలిన డబ్బులను ఇవ్వాలని నిర్ణయించారు. గ్రూప్ 1 బుక్స్కు సుమారు రూ. 5 వేలు, గ్రూప్ –2 బుక్స్కు రూ. 3 వేలు అవుతోంది. ఇవి పోను స్టైఫండ్ ఇవ్వనున్నారు. ఇక కేవలం స్టడీ సర్కిల్స్లో కోచింగ్ తీసుకుంటున్న వాళ్లకే స్నాక్స్ ఇస్తారు.
ఒక్క బీసీ స్టడీ సెంటర్ కూడా ఓపెన్ కాలే..
స్టడీ సర్కిల్స్తోపాటు మరో 50 వేల మందికి 103 స్టడీ సెంటర్ల ద్వారా ఫ్రీ కోచింగ్ ఇస్తమని అధికారులు ప్రకటించారు. ఆయా సెంటర్లలో రీడింగ్ రూమ్, ఆన్లైన్ క్లాస్ రూమ్, ఫ్యాకల్టీతో డౌట్స్ క్లియరెన్స్ రూమ్లను ఏర్పాటు చేస్తామన్నారు. కానీ ఏ ఒక్క చోట కూడా స్టడీ సెంటర్ ఏర్పాటు చేయలేదు. ఇప్పటికే నోటిఫికేషన్స్ వెలువడుతుండడంతో చాలా మంది ప్రైవేటు కోచింగ్ సెంటర్ల వైపు చూస్తున్నారు.