
మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ‘మన ఇసుక వాహనం’ ద్వారా ఉచితంగా ఇసుక సరఫరా చేయాలని కలెక్టర్ విజయేందిర బోయి అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ లో రెవెన్యూ, పోలీస్ అధికారులతో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ఇసుక సప్లై, డబుల్ బెడ్రూం ఇండ్ల కేటాయింపు, రేషన్ కార్డు అప్లికేషన్ల వెరిఫికేషన్, సీఎం ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారం తదితర అంశాలపై రివ్యూ చేశారు.
చిన్నచింతకుంట మండలం నెల్లికొండి, చిన్న వడ్డేమాన్, అప్పపల్లి, గూడూరు, మూసాపేట మండలం పోల్కంపల్లి, అడ్డాకుల మండలం కన్మనూరు, పోన్ కల్, రాచర్ల రీచ్ ల నుంచి ఉచితంగా ఇసుక సరఫరా చేయాలని ఆదేశించారు. రెవెన్యూ, పోలీస్ అధికారులు సమన్వయంతో పని చేస్తూ అక్రమ ఇసుక రవాణాను అరికట్టాలన్నారు. ఫిల్టర్ ఇసుక తయారీని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అడిషనల్ కలెక్టర్ మోహన్ రావు, అడిషనల్ ఎస్పీ రాములు, గనుల శాఖ సహాయ సంచాలకులు జి.సంజయ్ కుమార్, బి.వెంకట రమణ, ఆర్డీవో నవీన్, హౌసింగ్ పీడీ వైద్యం భాస్కర్, డీఎస్ వో వెంకటేశ్ పాల్గొన్నారు.