
- ఉప్పల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి శ్రీధర్ బాబు
ఉప్పల్, వెలుగు: నిధుల కొరత వెంటాడుతున్నా గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధికి కృషి చేస్తున్నామని మంత్రి శ్రీధర్బాబు చెప్పారు.
ప్రతిపక్షాలు నిర్మాణాత్మక సూచనలు, సహకారం ఇస్తే తీసుకుంటామన్నారు. ఉప్పల్, రామంతాపూర్ డివిజన్లలో రూ.42 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులకు ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్విజయలక్ష్మి, ఉప్పల్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం ఉప్పల్ వార్డు ఆఫీసులో మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్ను గ్లోబల్సిటీగా మార్చేందుకు కృషి చేస్తున్నామన్నారు.
ప్రపంచ దేశాలతో పోటీ పడేలా స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నామన్నారు. గోదావరి, కృష్ణ జలాలతో జంట నగరాల దాహార్తిని తీరుస్తున్నామన్నారు. కాగా ఉప్పల్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, ఆయన అనుచరులు, ఉప్పల్ కాంగ్రెస్ ఇన్చార్జ్మందమల్ల పరమేశ్వర్ రెడ్డి, ఆయన అనుచరులు పోటాపోటీ నినాదాలు చేయగా, పోలీసులు కలగజేసుకుని ఇరువర్గాలను శాంతింపజేశారు. కార్పొరేటర్లు రజిత, గీతాప్రవీణ్ ముదిరాజ్, శ్రీదేవి పాల్గొన్నారు.