-
12న ప్రధాని మోడీ బహిరంగ సభను సక్సెస్ చేయండి
-
బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి పిలుపు
చెన్నూర్, వెలుగు : రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ (ఆర్ఎఫ్సీఎల్) తో తెలంగాణలో ఎరువుల కొరత తీరుతుందని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు జి.వివేక్ వెంకటస్వామి అన్నారు. ఈ నెల 12న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రామగుండం పర్యటనలో భాగంగా ఎరువు కర్మాగారాన్ని ప్రారంభించి జాతికి అంకితం చేస్తారని చెప్పారు. ఈ సందర్భంగా నిర్వహించనున్న బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరుతూ మంగళవారం చెన్నూర్లో ప్రెస్మీట్ఏర్పాటు చేశారు. 1995లో మూతబడిన ఎరువుల ఫ్యాక్టరీని పునరుద్ధరించడానికి 2014 లోనే మోడీ ప్రభుత్వం రూ.6వేల కోట్లకు పైగా నిధులు కేటాయించిందన్నారు.
కాంగ్రెస్ పార్టీ హయాంలో తన తండ్రి వెంకటస్వామి ఎరువుల కర్మాగారం పునరుద్ధరణకు కృషి చేశారని చెప్పారు. తర్వాత తాను పెద్దపల్లి ఎంపీగా ఉన్నప్పుడు అనేక సార్లు అప్పటి ప్రధాని మన్మోహన్సింగ్ దృష్టికి తీసుకువెళ్లి కర్మాగారం తెరవడానికి కష్టపడ్డామన్నారు. 12.5 మిలియన్ టన్నుల ఉత్పత్తితో తెలంగాణలో యూరియా కొరత తీరుతుందన్నారు. మోడీ ప్రభుత్వం దేశంలో ఐదు ఎరువుల కర్మాగారాలను పునరుద్ధరించిందని తెలిపారు. పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గానికి మొదటిసారి ప్రధాన మంత్రి వస్తున్న సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభకు అన్ని వర్గాల ప్రజలు భారీ సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు.