
జైపూర్,వెలుగు: సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ ఎస్టీపీపీ.. కేజీఎఫ్ సీనిమాను తలపిస్తుందని ఎస్టీపీపీలో పనిచేసే కాంట్రాక్ట్ కార్మికులు చెప్పడం చాలా బాధాకరమని అన్నారు చెన్నూర్ ఎంఎల్ఏ కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకట స్వామి కుమారుడు గడ్డం వంశీ కృష్ణ. ఎన్నికల ప్రచారంలో భాగంగా 2023, నవంబర్ 27వ తేదీ సోమవారం ఎస్టీపీపీ కాంట్రాక్ వర్కర్ యూనియన్ దుస్స భాస్కర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గేట్ మీటింగ్ లో గడ్డం వంశీ కృష్ణ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా గడ్డం వంశీ కృష్ణ మాట్లాడుతూ.. మా తాతయ్య కాక వెంకట స్వామి కృషితో అక్కడ సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ ఏర్పాటు అయిందని చెప్పారు. చెన్నూర్ ఎంఎల్ఏ బాల్క సుమన్ అహంకార పాలనతోనే కాంట్రాక్ట్ కార్మికులను వేదిస్తున్నారని.. సిట్టింగ్ ఎంఎల్ఏ నిరుద్యోగ యువకులను మద్యానికి బానిస చేసి కుటుంబాలు నాశనం పట్టిస్తున్నాడని విమర్శించారు. ఎస్టీపీపీ, ఓపెన్ కాస్టులలో లోకల్ వాళ్లకు కాకుండా నాన్ లోకల్ వాళ్లకు 80 శాతం ఉద్యోగాలు ఇచ్చారని.. ఒక్కొక్కరి నుంచి రూ.లక్ష నుంచి రూ.5 లక్షలు తీసుకొని ఉద్యాగాలు ఇస్తున్నారని ఆయన ఆరోపించారు. బాల్క సుమన్ ప్రతి ఏటా ఇసుక దందాలో రూ.వెయ్యి కోట్ల స్మగ్లింగ్ చేస్తున్నాడని ఆరోపించారు.
చెన్నూర్ గోదావరిలో కొండల్లా తలిపిస్తున్న ఇసుక కుప్పలు నిల్వ ఉన్నాయని అన్నారు. చెన్నూరుకు వచ్చిన కేటీఆర్ గ్రూప్ 1 ,2 పేపర్లు లీకు చేసి నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్నాడని ఆరోపించారు. కేసీఆర్, కేటీఆర్ పుట్టే ప్రతి బిడ్డ పేరిట లక్ష రూపాయల అప్పు చేశారని అన్నారు. కాకా వెంకట స్వామి కుటుంబం ప్రజల సంక్షేమం కోరే కుటుంబమని, తాను సొంతంగా పెట్టిన ఆటం బైక్ తయారి కంపనీలో 500 మందికి ఉద్యోగాలు కలిపించామని చెప్పారు. చెన్నూర్ నియోజక వర్గంలో నిరుద్యోగులకు 40 వేల ఉద్యోగాలు కలిపించేందుకు కృషి చేస్తామని చెప్పారు. డిసెంబర్ 3న కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుందని.. మా నాన్న వివేక్ వెంకటస్వామిని చెన్నూర్ ఎంఎల్ఏగా గెలిపించాలని కాంట్రాక్ట్ కార్మికుల ను కోరారు.