కాకా 95వ జయంతి.. బడుగు వర్గాల ఆప్తుడు

కాకా 95వ జయంతి.. బడుగు వర్గాల ఆప్తుడు

దేశం మెచ్చిన బడుగు, బలహీన వర్గాల నాయకుడు 'కాకా '. దేశానికీ,  దేశంలోని  పీడిత  ప్రజలకు ఆయన చేసిన సేవలు అద్వితీయం. ఎక్కడ పీడిత, బాధిత ప్రజలు ఉంటే వారికి అండగా అక్కడ గడ్డం వెంకటస్వామి 'కాకా' ఉండేవారు. కుల, మతాలకు అతీతంగా ఆయన అందరినీ  సమానంగా చూసేవారు.  'కాకా'లోని సద్భావనను తెలియజేయడానికి ఆయన ధరించే  షేర్వాణి,  రుమాలి టోపీ చాలు. తెలంగాణలోని పేద ప్రజల గుండెల్లో ‘కాకా' నేటికీ  సజీవంగా ఉన్నారు. ఆయన మాటలు, బడుగు, బలహీన వర్గాల కోసం పాటుపడ్డ తీరు, అయన కార్యాచరణను ఎవరూ మరిచిపోలేరు. 

తొలి, మలి దశ తెలంగాణ సాధన ఉద్యమంలో  'కాకా' పాత్ర అత్యంత కీలకం అనేది జగమెరిగిన  సత్యం. 'కాకా' జయంతిని,  వర్ధంతిని  సీఎం  రేవంత్ రెడ్డి  నేతృత్వంలో  తెలంగాణలోని 33 జిల్లాలలో  కాంగ్రెస్  ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించి, జీవోను కూడా విడుదల చేయడం ఈసారి ప్రత్యేకం అని పేర్కొనవచ్చు.  కేంద్ర మంత్రిగా,  పార్లమెంట్​లో కాంగ్రెస్ పార్టీ ఉపనేతగా,  ఎన్నో కార్మిక సంఘాల ఆవిర్భావ అధ్యక్షుడిగా  పనిచేసిన కాకా జయంతిని  ఇయ్యాల అధికారికంగా  తెలంగాణ సర్కారు నిర్వహిస్తోంది.

సింగరేణి  నల్ల నేలలో 'కాకా' జ్ఞాపకాలు  సజీవం.  ప్రజల నేత అంటే ఇలా ఉండాలని నిరూపించిన నేలమీద లీడర్  గడ్డం వెంకటస్వామి.  కాకా పేరుతో ఆయన ప్రజల హృదయాల్లో నిలిచిపోయారు.  పేద, బడుగు, పీడిత, తాడిత ప్రజల గుండెల్లో  కాకా  నేటికీ బతికే ఉన్నారు.  నల్ల నేల ఆప్తమిత్రుడు దివంగత  గడ్డం వెంకటస్వామి అంటారు సింగరేణిలో.   నల్లనేల గుండెల్లో  ఆయన ఎప్పటికీ సజీవమే అనిపేర్కొనవచ్చు. 

దేశంలోని  ప్రముఖ  దళిత నేతలలో కాకా అంచెలంచెలుగా దేశం గర్వించే  లోక నాయకుడిగా ఎదిగారు. ఆయన ఎన్నడూ  నేల విడిచి సాము చేయలేదు.  నేల మీద నిలబడి పని చేశారు.  హైదరాబాద్​లో  వేలాది మంది  పేదల తరఫున భూ పోరాటం చేసి వారికి ఇంటి స్థలం ఇప్పించిన ఘనత అయనదే.  అందుకే  ఆయనను  గుడిసెల  వెంకటస్వామిగా  కూడా పిలుస్తారు.  ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం తొలి, మలి ఉద్యమంలోనూ కాకా పోరాడారు.  ఉద్యమానికి  ఎంతో చేయూతనిచ్చారు. స్థిరమైన రాజకీయాలకు  ఆయన  ఒక  కేరాఫ్ అడ్రస్.  నమ్మిన సిద్ధాంతానికి భిన్నంగా  వ్యవహరించిన దాఖలా లేదు.  నిత్యం పేదల కోసం,  వారి హక్కుల కోసం జ్వలించే  మనస్తత్వంతో ఉండి పోరాడేవారు. బడుగుల బాగుకోసం ఆరాటపడేవారు కాకా.

కాకా బాటలో వివేక్, వినోద్, వంశీ
'కాకా' పెద్దకొడుకు  గడ్డం  వినోద్,  చిన్న కొడుకు వివేక్, మనవడు  పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ  ఆయన బాటలోనే పయనిస్తున్నారు.  తెలంగాణ సాధన ఉద్యమంలో ఎంపీగా ఉన్న వివేక్​ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం అరెస్ట్ కూడా అయ్యారు.  పలు పోరాట కార్యక్రమాల్లో పాలుపంచుకున్నారు. 'కాకా'కు నల్లబంగారు నేల అన్నా..ఇక్కడి మనుషులు అన్నా ఎంతో ఇష్టం. 101 కార్మికసంఘాలకు 'కాకా' నాయకత్వం వహించారు.  కార్మికులంటే  ఆయనకు ఎంతో  ప్రేమ.   బీఐఎఫ్ఆర్  నుంచి  'సిక్కు' మార్కు  పడకుండా సింగరేణిని కాపాడటంలో యాజమాన్యం, కార్మిక సంఘాలు, అప్పటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం చేసిన కృషికి పూర్తి మద్దతును ఇచ్చి 'కాకా' కీలకంగా వ్యవహరించారు. 

ఆర్థికంగా కేంద్రం నుంచి 1100 కోట్ల రూపాయల అప్పు.. పది ఏండ్ల మారిటోరియం ఇప్పించారు. బొగ్గు గని కార్మికులకు ఐటీ మాఫీ చేయాలని కేంద్ర మంత్రిగా ఉండి పార్లమెంట్​లో తమ ప్రభుత్వాన్ని కోరిన మొదటి నేతగా 'కాకా'ను పేర్కొనవచ్చు.  ఆయన వద్ద దాపరికాలు, డాంబికాలు ఉండేవి కావు. 'కాకా' ఒక తెరిచిన పుస్తకంలాంటి వారు. ఎన్నో దానాలు, గుప్త దానాలు ఎక్కువగా చేసేవారు. తెలంగాణ ఉద్యమం సహా ఎన్నో ఉద్యమాలకు, పోరాటాలకు ఆయనిచ్చిన చేయూత మరువలేనిది..విస్మరించలేనిది. ‘కాకా'  ప్రాణహిత.. చేవెళ్ల ప్రాజెక్ట్  కోసం అప్పటి ఉమ్మడి రాష్ట్రం సీఎం దివంగత  వైఎస్సార్​తో తలపడ్డారు.  ప్రాజెక్ట్ శంకుస్థాపన రోజు అక్కడికి వచ్చి వైఎస్సార్  సభలోనే తన ఆశయం నెరవేర్చినందుకు ధన్యవాదాలు చెప్పారు.  'కాకా'
లాంటి నేతలు దేశంలో అరుదు. ఆయన వేసిన బాటలో ఎన్నో ఆదర్శాలు. ఎన్నో జ్ఞాపకాలు నేటికీవెంటాడుతూనే ఉంటాయి. 

హైదరాబాద్ కి 'షాన్'.. తెలంగాణకి 'జాన్'
కాకా కాంగ్రెస్ పార్టీలో  సీనియర్  నేతగా  హైదరాబాద్ కి 'షాన్'  తెలంగాణకి 'జాన్' అనక తప్పదు. ఆయన జీవితాంతం న్యాయం తరఫున పోరాటం చేశారు. ఒక నిజమైన నేత. ఏది మాట్లాడినా, ఏది చెప్పినా కుండ బద్దలు కొట్టినట్లే ఉండేది. అతి సామాన్యుడు సైతం 'కాకా'ను తన ఆప్తబంధువుగా భావించేవాడు. ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు  సైతం సులభంగా కలిసే అవకాశం ఎక్కడైనా లభించేది.  ఉమ్మడి రాష్ట్రంలో అధికార పార్టీలో ఉన్నా, విపక్షంలో ఉన్నప్పటికీ  నక్సలైట్ల పేరిట అమాయకులను తీసుకెళ్లి  పోలీసులు కాల్చి చంపిన సందర్భాల్లో  తీవ్రంగా, బహిరంగంగా ఖండించేవారు.  కేంద్ర మంత్రిగా ఉన్న సందర్భంలో  కూడా ఎలాంటి శషబిషలు లేకుండా బాధిత కుటుంబాల ఇంటికి వెళ్లి  పరామర్శించేవారు. అయన ఎవరికి ఏ సహాయం చేసినా బహిరంగంగా చెప్పుకునేవారు కాదు.  గుప్త దానాలు ఎక్కువగా చేసేవారు. ఆ పార్టీ, ఈ పార్టీ అనే తేడా లేకుండా ఆయన వద్దకు సహాయం కోసం వచ్చే ప్రతి ఒక్కరిని 'కాకా' కలిసి సహాయం చేసేవారు. ఆయన తర్వాత ఆయన కుమారులు వివేక్, వినోద్​ తండ్రి అడుగుజాడల్లో నడుస్తున్నారు.

కాకా అమర్ రహే.. 
కాకా హర్  ఏక్ కే దిల్ మే అబీ జిందా హై.

ఎండి మునీర్, సీనియర్ జర్నలిస్ట్