గద్దర్ అవార్డుల నామినేషన్లను నిష్పక్షపాతంగా పరిశీలించండి : దిల్ రాజు

 గద్దర్ అవార్డుల నామినేషన్లను నిష్పక్షపాతంగా పరిశీలించండి : దిల్ రాజు
  • జ్యూరీ సభ్యులకు ఎఫ్​డీసీ చైర్మన్​ దిల్​ రాజు సూచన

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గద్దర్‌‌ తెలంగాణ ఫిల్మ్ అవార్డులకు అందిన నామినేషన్లను నిష్పక్షపాతంగా పరిశీలించాలని జ్యూరీ సభ్యులకు ఫిలిం డెవలప్​మెంట్​ కార్పొరేషన్​(ఎఫ్​డీసీ) చైర్మన్​ దిల్ రాజు సూచించారు. తెలుగు సినిమా రంగానికి జాతీయస్థాయి గుర్తింపు తెచ్చేలా వ్యవహరించాలని తెలిపారు. మంగళవారం ఎఫ్​డీసీ సమావేశ మందిరంలో జ్యూరీ చైర్​పర్సన్​, సినీనటి జయసుధ అధ్యక్షతన గద్దర్ అవార్డ్స్ జ్యూరీ సమావేశం జరిగింది.

 ప్రభుత్వం అప్పగించిన బాధ్యతను చాలెంజ్ గా తీసుకుని ఈ ఎంపిక ప్రక్రియను పూర్తి చేయనున్నట్టు జయసుధ తెలిపారు. ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ..  14  ఏండ్ల తర్వాత ప్రభుత్వం చలన చిత్ర అవార్డ్స్ ను ఇస్తున్నదని అన్నారు. 

21 నుంచి నామినేషన్ల స్క్రీనింగ్ 

 సినీ నటి జయసుధ చైర్​ పర్సన్​గా  15 మందితో గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్ జ్యూరీని ప్రభుత్వం ఏర్పాటు చేసినట్టు ఎఫ్​డీసీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్​ ఎస్​. హరీశ్​ తెలిపారు. గద్దర్ అవార్డ్స్ కు అన్ని కేటగిరీలకు కలిపి 1,248 నామినేషన్లు అందాయని చెప్పారు. ఈ నెల 21 నుంచి నామినేషన్ల స్క్రీనింగ్ జరుగుతుందని చెప్పారు. పురస్కారాలకు వ్యక్తిగత కేటగిరీలో 1,172,  ఫీచర్‌‌ ఫిలిం, బాలల చిత్రాలు, డెబ్యూ చిత్రాలు, డాక్యుమెంటరీ లేదా లఘుచిత్రాలు, ఫిల్మ్ క్రిటిక్స్, పుస్తకాలు తదితర కేటగిరీల్లో 76 దరఖాస్తులు వచ్చినట్టు పేర్కొన్నారు.