
- జ్యూరీ సభ్యులకు ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు సూచన
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులకు అందిన నామినేషన్లను నిష్పక్షపాతంగా పరిశీలించాలని జ్యూరీ సభ్యులకు ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్(ఎఫ్డీసీ) చైర్మన్ దిల్ రాజు సూచించారు. తెలుగు సినిమా రంగానికి జాతీయస్థాయి గుర్తింపు తెచ్చేలా వ్యవహరించాలని తెలిపారు. మంగళవారం ఎఫ్డీసీ సమావేశ మందిరంలో జ్యూరీ చైర్పర్సన్, సినీనటి జయసుధ అధ్యక్షతన గద్దర్ అవార్డ్స్ జ్యూరీ సమావేశం జరిగింది.
ప్రభుత్వం అప్పగించిన బాధ్యతను చాలెంజ్ గా తీసుకుని ఈ ఎంపిక ప్రక్రియను పూర్తి చేయనున్నట్టు జయసుధ తెలిపారు. ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ.. 14 ఏండ్ల తర్వాత ప్రభుత్వం చలన చిత్ర అవార్డ్స్ ను ఇస్తున్నదని అన్నారు.
21 నుంచి నామినేషన్ల స్క్రీనింగ్
సినీ నటి జయసుధ చైర్ పర్సన్గా 15 మందితో గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్ జ్యూరీని ప్రభుత్వం ఏర్పాటు చేసినట్టు ఎఫ్డీసీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ఎస్. హరీశ్ తెలిపారు. గద్దర్ అవార్డ్స్ కు అన్ని కేటగిరీలకు కలిపి 1,248 నామినేషన్లు అందాయని చెప్పారు. ఈ నెల 21 నుంచి నామినేషన్ల స్క్రీనింగ్ జరుగుతుందని చెప్పారు. పురస్కారాలకు వ్యక్తిగత కేటగిరీలో 1,172, ఫీచర్ ఫిలిం, బాలల చిత్రాలు, డెబ్యూ చిత్రాలు, డాక్యుమెంటరీ లేదా లఘుచిత్రాలు, ఫిల్మ్ క్రిటిక్స్, పుస్తకాలు తదితర కేటగిరీల్లో 76 దరఖాస్తులు వచ్చినట్టు పేర్కొన్నారు.