
గద్వాల, వెలుగు: జిల్లాలో నీటి క్వాలిటీని నిరంతరం పరీక్షించి, శుద్ధమైన తాగునీటిని ప్రజలకు అందించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సంతోష్ ఆఫీసర్లను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ లోని ఎస్-27లో జిల్లా గ్రామీణ నీటి విశ్లేషణ ప్రయోగశాలను కలెక్టర్ ప్రారంభించారు. ప్రయోగశాలలోని వివిధ విభాగాలను పరిశీలించి వాటి పనితీరును అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా ప్రజలకు శుద్ధమైన తాగునీటిని అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. నీటి నాణ్యతను పర్యవేక్షించేందుకు జేజేఎం రూల్స్ కు అనుగుణంగా ఎన్ఏబీఎల్ అక్రిడిటేషన్కు అనుగుణమైన ప్రమాణాలతో జిల్లా స్థాయి నీటి నాణ్యత ప్రయోగశాలను ప్రారంభించినట్లు తెలిపారు.
ఈ ల్యాబ్ ద్వారా తాగునీటి నమూనాలను శాస్త్రీయంగా విశ్లేషించి, అందులోని రసాయనాలు, సూక్ష్మజీవుల కాలుష్య స్థాయిని గుర్తించవచ్చని తెలిపారు. అంతకుముందు కలెక్టరేట్ కాంప్లెక్స్లో ప్రజలు, కార్యాలయ సిబ్బంది కోసం వాటర్ ప్లాంట్ను ప్రారంభించారు. అడిషనల్ కలెక్టర్లు లక్ష్మీనారాయణ, నర్సింగ రావు, ఆర్డీవో శ్రీనివాస రావు, డీపీవో నాగేంద్రం, మిషన్ భగీరథ ఈఈ శ్రీధర్ రెడ్డి పాల్గొన్నారు. అంతకుముందు వడదెబ్బ నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రూపొందించిన వాల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు.