సైబర్ వలలో రిటైర్డ్ మహిళా ఉద్యోగిని

సైబర్ వలలో రిటైర్డ్ మహిళా ఉద్యోగిని
  • మనీ ల్యాండరింగ్, హ్యూమన్ ట్రాఫికింగ్ కేసుల పేరిట బెదిరింపులు
  • రూ.23 లక్షల చీటింగ్ 

బషీర్​బాగ్, వెలుగు: మనీ ల్యాండరింగ్, హ్యూమన్ ట్రాఫికింగ్ కేసుల పేరుతో బెదిరించి సిటీకి చెందిన ఓ ప్రభుత్వ రిటైర్డ్ మహిళా ఉద్యోగినిని సైబర్ నేరగాళ్లు మోసగించారు. రూ.23 లక్షలను కొట్టేశారు. సికింద్రాబాద్​కు చెందిన ప్రభుత్వ రిటైర్డ్​ఉద్యోగిని(65)కి ఇటీవల టెలికాం డిపార్ట్​మెంట్ నుంచి అంటూ ఓ ఫోన్ కాల్ వచ్చింది. ‘మీ పేరిట ఉన్న ఫోన్​నంబర్​తో కాల్స్ చేసి మోసాలకు పాల్పడినందుకు ఎఫ్ఐఆర్ నమోదైంది. మీ కాల్​ను బెంగళూరు ఎస్సైకు ట్రాన్స్​ఫర్​చేస్తున్నాం’ అని స్కామర్​చెప్పాడు. తర్వాత మరొక స్కామర్​లైన్​లోకి వచ్చాడు. 

విచారణ కోసం బెంళూరుకు రావాలని బెదిరించాడు. షాక్​కు గురైన మహిళ తాను ఎలాంటి తప్పు చేయలేదని, బెంగళూరుకు రాలేనని చెప్పింది. ఆ వెంటనే స్కామర్​ఈ కేసును సైబర్ క్రైమ్ పోలీసులకు బదిలీ చేస్తున్నామని, వారు త్వరలో మిమ్మల్ని సంప్రదిస్తారని చెప్పి కట్​చేశాడు. కొద్దిసేపటి తర్వాత మహిళకు మరో ఫోన్ కాల్ వచ్చింది. ఢిల్లీ నుంచి ఐపీఎస్​ఆఫీసర్​సదాసత్ ఖాన్ ను మాట్లాడుతున్నానని మహిళతో నమ్మబలికాడు. మీ పేరు మీద ముంబైలో ఓ బ్యాంక్​అకౌంట్​ఉందని, దాని నుంచి మనీ ల్యాండరింగ్ కు పాల్పడ్డారని బెదిరించాడు. 

ఆ కేసుతోపాటు హ్యూమన్ ట్రాఫికింగ్ కేసు కూడా నమోదైందని చెప్పాడు. మీ ప్రమేయం లేదని తేల్చాలంటే ఆర్బీఐ నిబంధనల ప్రకారం తమకు మనీ ట్రాన్స్​ఫర్​చేయాలన్నాడు. వెరిఫై చేశాక డబ్బు రిటర్న్ చేస్తామని నమ్మబలికాడు. ఆ వెంటనే మహిళకు నమ్మకం కలిగించేలా ఫేక్ ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ పేరుతో లెటర్ పంపించాడు. తనను ఎక్కడ అరెస్ట్​చేస్తారోననే భయంతో మహిళ స్కామర్ల అకౌంట్ కు మొత్తం రూ.23 లక్షలు ట్రాన్స్​ఫర్ చేసింది. తర్వాత తనకు ఎలాంటి కాల్స్​రాకపోవడంతో మోసపోయానని గ్రహించి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హైదరాబాద్ సైబర్ క్రైమ్ ఏసీపీ శివమారుతి తెలిపారు.