
రేగొండ, వెలుగు: బీఆర్ఎస్తో దేశ రాజకీయాల్లో మార్పు రానుందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం రేగొండ మండల కేంద్రంలో రైతు బంధు జిల్లా కోఆర్డినేటర్ హింగె మహేందర్ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనతి కాలంలోనే అన్ని రంగాల్లో తెలంగాణ అగ్రగామిగా నిలిచిందన్నారు. రైతు సంక్షేమమే లక్ష్యంగా కేసీఆర్సర్కార్రైతుబంధు, రైతుబీమా, వ్యవసాయానికి 24గంటలు నాణ్యమైన కరెంట్ఇస్తోందన్నారు. దేశానికి కేసీఆర్ నాయకత్వం ఎంతో అవసరమని ఎమ్మెల్యే చెప్పారు. కార్యక్రమంలో రైతు విమోచన కమిటీ చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్రావు, సమ్మారావు, ఎంపీపీ లక్ష్మీ, జడ్పీటీసీ విజయ, మండలాధ్యక్షుడు రాజేందర్, లీడర్లు సంతోష్, విజ్జన్రావు, ఉమేష్గౌడ్, భిక్షపతి పాల్గొన్నారు.
సర్వమత సమ్మేళన యజ్ఞం
కాశీబుగ్గ, వెలుగు: టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారిన సందర్భంగా శుక్రవారం రంగశాయిపేటలోని ఎలగందుల లక్ష్మీనారాయణ వృద్ధాశ్రమంలో పార్టీ స్టేట్ లీడర్ రాజనాల శ్రీహరి సర్వమత సమ్మేళన యజ్ఞం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా కేటీఆర్ నియమితులు కావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఎస్కె.గోరేమీయా, ఎండి దస్తగిరి, ఫ్రాన్సిస్ జూషువా, ఎర్ర మధు, పోలెపాక ప్రసాద్, రామ్ సింగ్, ఉరాన్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.
గ్రూప్–1 పరీక్షకు ఏర్పాట్లు చేయాలి
మహబూబాబాద్, వెలుగు: ఈనెల 16న జరిగే గ్రూప్–1 పరీక్షకు అన్ని ఏర్పాట్లు చేయాలని మహబూబాబాద్ కలెక్టర్ శశాంక కోరారు. శుక్రవారం కలెక్టరేట్లో రివ్యూ చేశారు. జిల్లాలో 4058 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకానున్నారని, 15 ఎగ్జామ్సెంటర్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మహబూబాబాద్ లో 13 , తొర్రూర్ లో 2 సెంటర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎస్పీ శరత్చంద్ర పవార్ మాట్లాడుతూ ప్రతి సెంటర్వద్ద సబ్ ఇన్స్పెక్టర్, ఇద్దరు కానిస్టేబుల్స్, ఒక మహిళా పోలీస్ కానిస్టేబుల్ విధుల్లో ఉంటారన్నారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ డేవిడ్, ఆర్డీవోలు రమేశ్, కొమురయ్య పాల్గొన్నారు.
జనగామ అర్బన్, వెలుగు: గ్రూప్–1 ఎగ్జామ్ రాసే అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని జనగామ కలెక్టర్
సి.హెచ్. శివలింగయ్య ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని ఆర్యభట్ట హై స్కూల్, జనగామ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీ కాలేజీలో ఏర్పాటు చేయనున్న ఎగ్జామ్సెంటర్ను అడిషనల్ కలెక్టర్ అబ్దుల్ హామీద్ సంబంధిత అధికారులతో కలిసి రివ్యూ నిర్వహించారు. రివ్యూలో డీఆర్డీవో రాంరెడ్డి, ఆర్డీవోలు మధుమోహన్, కృష్ణవేణి, డీఈవో కె. రాము, పాల్గొన్నారు.
బీజేపీ కోసం తపించిన మహనీయుడు నర్సయ్య సార్
పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్
హనుమకొండ, వెలుగు: తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలని ఏబీవీపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, బీజేపీ రాష్ట్ర నాయకుడు గుజ్జుల నర్సయ్య సార్ తపించేవారని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. శుక్రవారం గుజ్జుల నర్సయ్య సంస్మరణ సభ హంటర్ రోడ్డులోని ఓ ఫంక్షన్హాల్లో జరిగింది. కార్యక్రమానికి అఖిల భారత ప్రచార ప్రముఖ్ సునీల్ అంబేకర్, బండి సంజయ్ కుమార్ చీఫ్ గెస్ట్గా హాజరయ్యారు. ముందుగా నర్సయ్య ఫొటోకు నివాళులర్పించారు. బండి సంజయ్ మాట్లాడుతూ రాష్ట్రంలో బీజేపీ పాలన కళ్లారా చూడాలని, దానికోసమే బతికున్నానని నర్సయ్య సార్ తరచూ చెప్పేవారని, శిష్యుడిగా ఆయన ఆశయాల సాధన కోసం కృషి చేస్తానన్నారు. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో టీచర్వృత్తిని కొనసాగిస్తూనే సంఘ్ కార్యకలాపాలను విస్తరించేందుకు పనిచేసిన మహనీయుడు నర్సయ్య సార్ అని కొనియాడారు. సార్ను చూస్తే దీన్ దయాళ్ ఉపాధ్యాయ్, యశ్వంత్ రావు గుర్తుకొస్తారన్నారు. చనిపోయిన తర్వాత తన బాడీపై కాషాయ జెండా కప్పాలని భావించే తనలాంటోళ్లందరికీ నర్సయ్య నర్సయ్య సార్ ఆదర్శనీయుడన్నారు. కార్యక్రమంలో బీజేపీ హనుమకొండ, వరంగల్ జిల్లాల అధ్యక్షులు రావు పద్మ, కొండేటి శ్రీధర్, ఏబీవీపీ జాతీయ సహ సంఘటన కార్యదర్శి ఎన్.బాలకృష్ణ, రాష్ట్ర అధ్యక్షుడు పారుపల్లి శంకర్, వరంగల్ జిల్లా కార్యావాహ్ పెద్దిరెడ్డి మల్లారెడ్డి, కుటుంబ సభ్యులు రఘురాం, రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
హసన్ పర్తి, వెలుగు: హనుమకొండ జిల్లా హసన్పర్తి మండల కేంద్రానికి చెందిన బీజేపీ జిల్లా కార్యదర్శి గుండమీద శ్రీనివాస్ ఇటీవల అనారోగ్యంతో చనిపోయారు. వారి కుటుంబ సభ్యులను రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పరామర్శించారు. శ్రీనివాస్ కుటుంబానికి ఎల్లవేళలా పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
బండి సంజయ్ను కలిసిన బీజేపీ శ్రేణులు
జనగామ అర్బన్, వెలుగు: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కుమార్ హైదరాబాద్ నుంచి హనుమకొండ వెళుతుండగా జనగామలో పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆరుట్ల దశమంతరెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ శ్రేణులు కలిశారు. బొకే ఇచ్చి శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకుడు ఉడుగుల రమేశ్, మున్సిపల్ కౌన్సిలర్ హరిశ్చంద్ర గుప్త, జిల్లా ప్రధాన కార్యదర్శి సౌడ రమేశ్, జిల్లా ఉపాధ్యక్షుడు రాజశేఖర్ గౌడ్, భువనగిరి పార్లమెంట్ కో కన్వీనర్ శ్రీనివాస్, రాంమోహన్రెడ్డి, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు నారాయణ, జిల్లా ప్రచార కార్యదర్శి జగదీశ్ పాల్గొన్నారు.
నవయుగ శతకం ఆవిష్కరణ
భీమదేవరపల్లి , వెలుగు: ములుకనూర్ ప్రజా గ్రంథాలయం, తెలంగాణ సాహిత్య కళా వేదిక ఆధ్వర్యంలో కొప్పూర్ గ్రామానికి చెందిన నల్లగొండ సురేశ్ ఆటవెలది చంధస్సులో రాసిన నవయుగ శతకాన్ని ముల్కనూర్ సర్పంచ్ మాడ్గుల కొంరయ్య ఆవిష్కరించారు. మొదటి కాపీని కొప్పూర్ సర్పంచ్ రాజమణికి అందించారు. డా.పాతూరి రఘురామయ్య గ్రంథ సమీక్ష చేశారు. నవయుగ శతకం చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు. ఈ శతకం నేటి స్థితిగతులకు అద్దం పడుతుందన్నారు. సభాధ్యక్షుడు డా. కర్రె సదాశివ్ మాట్లాడుతూ నవయుగ శతకం ఎన్నేండ్లయినా నిలిచిపోతుందన్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీ పద్మ, కొత్తకొండ లలిత, డా.క్రిష్ణ కుమార్, అసిస్టెంట్ ప్రొఫెసర్ గోస్కుల రమేశ్, తెలంగాణ సాహిత్య కళా వేదిక అధ్యక్షుడు అంజయ్య, కార్యవర్గ సభ్యులు కాల్వ రాజయ్య, సాహిత్యాభిమానులు, ఇతరులు పాల్గొన్నారు.
సుధాకర్ ఎక్కడున్నా లొంగిపోవాలి.. దళితబంధు, రివార్డు అందేలా కృషి చేస్తాం
చిట్యాల, వెలుగు: 22 ఏండ్ల కింద అజ్ఞాతంలోకి వెళ్లిన మావోయిస్టు నేత సిరిపెల్లి సుధాకర్అలియాస్ మురళి ఎక్కడున్నా లొంగిపోవాలని భూపాలపల్లి డీఎస్పీ రాములు పిలుపునిచ్చారు. లొంగిపోతే ప్రభుత్వం నుంచి దళితబంధుతోపాటు రూ.5లక్షల రివార్డు అందేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం చల్లగరిగకు చెందిన సుధాకర్ 22 ఏండ్ల కింద పీపుల్స్ వార్ పార్టీలో చేరారు. అంచెలంచెలుగా ఎదిగి ప్రస్తుతం సౌత్ బస్తర్ దండకారణ్య జోన్లో డివిజనల్ కమిటీ సభ్యుడిగా మురళి పేరుతో కొనసాగుతున్నాడు. సుధాకర్ తల్లి రాజపోషమ్మ అనారోగ్యంతో బాధపడుతుండగా డీఎస్పీ రాములు శుక్రవారం గ్రామానికి వెళ్లి ఆమె బాగోగులు అడిగి తెలుసుకున్నారు. దసరా సందర్భంగా 25కిలోల బియ్యం, దుస్తులు సహా రూ.5వేల విలువైన వస్తువులు అందజేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ సుధాకర్ లొంగిపోయి వృద్ధాప్యంలో ఉన్న తల్లి బాగోగులు చూసుకోవాలని సూచించారు. తన కొడుకు అడవిబాట పట్టి దూరమయ్యాడని, తోడు ఎవరు లేరని తల్లి రాజపోషమ్మ ఆవేదన వ్యక్తం చేసింది. ఎక్కడున్నా లొంగిపోవాలని కొడుకు సుధాకర్ను వేడుకుంది. అనంతరం డీఎస్పీ రాజపోషమ్మను ఇంట్లోకి తీసుకెళ్లి ప్రత్యేకంగా మాట్లాడారు. డీఎస్పీ వెంట ఎస్సైలు కృష్ణప్రసాద్, షాఖాహాన్ ఉన్నారు.
విమర్శలు చేస్తే గొప్పోళ్లు కాలేరు
పరకాల, వెలుగు: రాజకీయాల్లో పార్టీ మారే సందర్భంలో విమర్శలు చేయడం పరిపాటిగా మారిందని, అలా విమర్శలు చేస్తే గొప్పొళ్లు కారని టీఆర్ఎస్ జిల్లా నాయకులు సోదా రామకృష్ణ, పరకాల ఏఎంసీ చైర్మన్ సారంగపాణి అన్నారు. శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ పార్టీ హైకమాండ్ ను విమర్శిస్తే గొప్పోళ్లు కాదని మొలుగూరి గ్రహించాలన్నారు. సీఎం కేసీఆర్ ఉద్యమకారులకు, బీసీ నాయకులకు ప్రాధాన్యత ఇవ్వబట్టే ఆయనకు సర్పంచ్ నుంచి ఎమ్మెల్యే వరకు పార్టీ టికెట్లు వచ్చాయన్నారు. స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీ మారుతున్న నీవెంట టీఆర్ఎస్ నాయకులు వస్తారనడం విడ్డూరంగా ఉందని చెప్పారు. సమావేశంలో టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు మడికొండ శ్రీను, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.