
- 9 మందిపై కేసు.. అదుపులో ముగ్గురు
- ఇప్పటికే ముగ్గురు నిందితులు జైల్లో..
ఆదిలాబాద్ టౌన్, వెలుగు: తెలంగాణ గ్రామీణ బ్యాంకులో గతేడాది దోపిడీకి యత్నించిన దుండుగులను అరెస్టు చేసినట్లు ఎస్పీ అఖిల్మహాజన్ తెలిపారు. శనివారం పోలీస్ హెడ్క్వార్టర్స్లో విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. పట్టణంలోని పలు కాలనీలకు చెందిన యువకులు జల్సాలకు అలవాటు పడి ఓ ముఠాగా ఏర్పడి నేరాలకు పాల్పడుతున్నారు. గతేడాది డిసెంబర్12న ఆదిలాబాద్ రూరల్ మండలం రామాయిలో తెలంగాణ గ్రామీణ బ్యాంకులో దోపిడీకి ప్లాన్ వేశారు.
అర్ధరాత్రి అక్కడికి చేరుకొని బ్యాంకు గోడను పగులగొట్టి లోపలికి చొరబడ్డారు. అయితే బ్యాకులోని సీసీ కెమెరాలు హ్యూమన్ డిటెక్ట్ సాఫ్ట్వేర్ దుండగులను గుర్తించి అలారం మోగడంతో పరారయ్యారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని గాలింపు చర్యలు చేపట్టారు. శనివారం కచికంటి శివారులో అనుమానస్పదంగా తిరుగుతున్న ముగ్గురిని అదుపులోకి తీసుకొని విచారించగా నేరం అంగీకరించారు.
పట్టుబడిన వారిలో భుక్తాపూర్కు చెందిన దగడ్ సాయి అలియాస్ సెంబేటి సాయికుమార్, కేఆర్కే కాలనీకి చెందిన అశోక్ అలియాస్ఆశ, మినుగు రాజేశ్వర్ అలియాస్ రాజేశ్ ఉన్నారు. వారి వద్ద నుంచి దొంగతనానికి ఉపయోగించిన గ్యాస్ సిలిండర్, గ్యాస్ కట్టర్, గడ్డపారలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పుష్ప అలియాస్పవన్, మణికంఠ, జాదవ్ రాజు పరారీలో ఉండగా దొంగతనం ప్లాన్ వేసిన చవాన్ రవి, సన్నీ అలియాస్సుఖ్దేవ్ సన్నీ, గోవిందుడు కార్తీక్ అలియాస్ గోల్డెన్ కార్తీక్ ఇతర కేసుల్లో ప్రస్తుతం జైల్లో ఉన్నట్లు వెల్లడించారు. వీరంతా ఆదిలాబాద్తో పాటు ఇతర జిల్లాల్లో గతంలో చోరీలతో పాటు ఇతర కేసుల్లో జైలుకు వెళ్లివచ్చారన్నారు. సమావేశంలో డీఎస్పీ జీవన్రెడ్డి, సీసీఎస్ సీఐ చంద్రశేఖర్, రూరల్ సీఐ ఫణిధర్, ఎస్సై ముజాహిద్, సిబ్బంది పాల్గొన్నారు.