
కంది, వెలుగు : కోర్టు హాలు లో భద్రపరిచిన కేసు ప్రాపర్టీ అయిన గంజాయి సంచిని దొంగిలించిన వ్యక్తిని మంగళవారం సంగారెడ్డి టౌన్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు పంపారు. కేసు వివరాలను సంగారెడ్డి డీఎస్పీ రమేశ్కుమార్ తన ఆఫీసులో మీడియాకు వెల్లడించారు. సంగారెడ్డి టౌన్లో నివాసముండే షేక్ మహబూబ్(50) ఓ ఫైనాన్స్ యజమాని వద్ద కలక్షన్ లేబర్గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. కాగా సంగారెడ్డి టౌన్ పరిధిలో జరిగిన ఓ ఏటీఎం దొంగతనం కేసులో నిందితులకు అతడు జామీన్ ఇచ్చాడు. నిందితులు కోర్టు సమయంలో కోర్టుకు రానందున షేక్ మహబూబ్కు కోర్టు రూ.30వేలు జరిమానా వేసింది.
ఆ డబ్బులు ఈ నెల16న కట్టాల్సి ఉండగా, డబ్బులు లేకపోవడంతో -కోర్టు హాలులో భద్రపరిచిన గంజాయిని దొంగిలించాడు. విషయాన్ని గమనించిన కోర్టు సిబ్బంది ఉన్నతాధికారులకు తెలుపగా ఈ నెల 19న కోర్టు సీనియర్ సూపరింటెండెంట్ విజయ్ నాయక్ సంగారెడ్డి టౌన్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వెంటనే ఇన్స్పెక్టర్ శీధర్ రెడ్డి ఘనటనా స్థలాన్ని పరిశీలించారు.
షూ మార్క్స్, సీసీ టీవీ ఫూటేజ్ఆధారంగా నిందితుడు షేక్ మహబూబ్ను మంగళవారం అదుపులోకి తీసుకొని విచారించగా అతడు నేరాన్ని ఒప్పుకున్నాడు. నిందితుడి నుంచి దొంగలించిన గంజాయి సంచిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అడిడిని రిమాండ్కు తరలిస్తామని డీఎస్పీ తెలిపారు.