- మరొకరికి తీవ్రగాయాలు
- గచ్చిబౌలి ల్యాంకోహిల్స్ వద్ద ఘటన
గచ్చిబౌలి, వెలుగు : ఓ మహిళ కారును స్పీడ్ గా ర్యాష్ డ్రైవింగ్ చేయగా.. గార్డెనింగ్ మహిళా కార్మికుల్లో ఒకరు మృతిచెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన ప్రకారం.. నారాయణపేట జిల్లాలోని నిజ్జంతకు చెందిన కోటకొండ జయమ్మ(50) సిటీకి కుటుంబంతో వచ్చి మణికొండలో ఉంటుంది. నాలుగేళ్లుగా ల్యాంకో హిల్స్ లో గార్డెనింగ్ కార్మికురాలిగా చేస్తుంది. మంగళవారం ఉదయం 10.30 గంటలకు ల్యాంకోహిల్స్ విల్లాస్ సమీపంలోని రోటరీ గార్డెనింగ్ లో జయమ్మతో పాటు మరో కూలీ పద్మ(34), మరికొందరు పనుల్లో ఉన్నారు.
ల్యాంకోహిల్స్ రోడ్డుపైన ఐ20 కారును మహిళ స్పీడ్ గా ర్యాష్ డ్రైవింగ్ చేయడంతో అదుపు తప్పి వేగంగా వెళ్లి గార్డెనింగ్ మహిళా కూలీలను ఢీకొట్టింది. ఆపై కారు డివైడర్ మీదకు ఎక్కింది. జయమ్మ తలకు తీవ్రగాయాలై స్పాట్ లోనే మృతిచెందింది. మరో కూలీ పద్మ తీవ్రంగా గాయపడగా.. స్థానికంగా ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. రాయదుర్గం పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన దీప్తిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. కారును స్వాధీనం చేసుకున్నారు.