సబ్సిడీ రుణాలను సద్వినియోగం చేసుకోవాలన్న గరిమా అగర్వాల్

సబ్సిడీ రుణాలను సద్వినియోగం చేసుకోవాలన్న గరిమా అగర్వాల్
  •     చాట్లపల్లిలో వికసిత్​ భారత్ సంకల్ప యాత్ర

జగదేవపూర్, వెలుగు: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఐఏఎస్ అజయ్ గుప్తా, సిద్దిపేట జిల్లా అడిషనల్ కలెక్టర్ గరిమా అగర్వాల్ సూచించారు. సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం చాట్లపల్లిలో శనివారం స్టేట్​బ్యాంక్​ఆఫ్​ఇండియా, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ ఆధ్వర్యంలో ‘వికసిత్ భారత్ సంకల్ప యాత్ర’ ప్రోగ్రామ్​నిర్వహించారు.

అజయ్​గుప్తా, గరిమా అగర్వాల్ పాల్గొని వివిధ శాఖల అధికారులు ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. ప్రధానమంత్రి ఉజ్వల యోజన ద్వారా మంజూరైన గ్యాస్ కనెక్షన్లను, మండల సమాఖ్యకు రూ. 2 కోట్ల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కేంద్రం అందిస్తున్న సబ్సిడీ రుణాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని సూచించారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు కేంద్ర పథకాలు అందుతున్నాయో? లేదో సంకల్ప యాత్ర ద్వారా తెలుసుకుంటున్నట్లు తెలిపారు.

ప్రతిరోజూ 14 గ్రామ పంచాయతీల పరిధిలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ఏపీడీ జయదేవ్, డీఏఓ శివప్రసాద్, డీఎంహెచ్ఓ కాశీనాథ్, సర్పంచ్ రాచర్ల నరేశ్, ఎంపీపీ బాలేశం గౌడ్, ఎంపీటీసీ కావ్య, ఎంపీడీఓ శ్రీనివాస్ వర్మ, ఏఓ వసంతరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.