మరికొన్ని రోజుల్లో అంటే.. 2024, ఫిబ్రవరి 27వ తేదీ నుంచి తెలంగాణ రాష్ట్రంలోని పేదలకు గ్యాస్ బండ 500 రూపాయలకే ఇస్తారు.. కాకపోతే ఇక్కడ కొన్ని కండీషన్స్.. నిబంధనలు ఉన్నాయి. లబ్ధిదారులు ఎవరూ కన్ఫ్యూజ్ కాకుండా.. క్లారిటీ కోసం వీ6 వెలుగు ఇస్తున్న సమాచారం ఇది.
ఇంటికి వచ్చే గ్యాస్ బండకు 500 రూపాయల బిల్లు కాదు.. మొత్తం బిల్లు అంటే.. ఆ నెల ఎంత ఉంటే అంత కట్టాలి. 500 రూపాయలకు గ్యాస్ బండ ఇవ్వరు. గ్యాస్ సిలిండర్ మార్కెట్ రేటు ప్రకారం అంటే.. 955 రూపాయలు చెల్లించాలి. ఆ తర్వాత అర్హత ఆధారంగా.. మీకు మిగిలిన డబ్బు బ్యాంక్ లో జమ చేస్తుంది ప్రభుత్వం.
ఉదాహరణకు మార్చి నెలలో 955 రూపాయలు గ్యాస్ సిలిండర్ ధర ఉంటే.. ఇంటి దగ్గర మీరు 955 రూపాయలు చెల్లించాలి. ఆ తర్వాత మీ బ్యాంక్ ఖాతాలో 455 రూపాయలు జమ అవుతాయి. అప్పుడు మీకు 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ బిల్లు చెల్లించినట్లు అవుతుంది. గ్యాస్ ఏజెన్సీలు ఇచ్చే బిల్లు మొత్తం చెల్లించిన తర్వాత.. 500 రూపాయలుపోను.. మిగతా డబ్బు మీ బ్యాంక్ ఖాతాలో జమ అవుతుందన్న మాట.. ఈ విషయాన్ని గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది.
చాలా మంది ప్రజలు ఇంటి దగ్గరకే 500 రూపాయలు చెల్లించాలనే ఉద్దేశంలో ఉన్నారు.. గ్యాస్ ఏజెన్సీలకు మీరు పూర్తి బిల్లు కట్టిన తర్వాతే.. మీ అర్హత ఆధారంగా మిగిలిన డబ్బు మీ బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది అన్న విషయాన్ని గుర్తించుకోవాలి..
గ్యాస్ సబ్సిడీ స్కీమ్ మార్గదర్శకాలు
- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఆహార భద్రత కార్డులున్న (రేషన్ కార్డులు) వారు ఈ స్కీమ్కు అర్హులుగా తేల్చారు.
- ప్రజా పాలనలో తప్పనిసరిగా గ్యాస్ సబ్సిడీ కోసం దరఖాస్తు చేసుకుని ఉండాలనే నిబంధన విధించారు.
- సిలిండర్ల కేటాయింపు అనేది.. గడిచిన మూడేండ్లుగా లబ్ధిదారులు సగటున ఎన్ని సిలిండర్లు వినియోగిస్తున్నారనే ఆధారంగా అందజేయనున్నారు.
- ఇప్పటి వరకు గుర్తించిన దాదాపు 40 లక్షల మంది లబ్ధిదారులకు ఈ పథకం అమలు చేయనున్నారు.
- సిలిండర్ డెలివరీ సమయంలోనే లబ్ధిదారులు పూర్తిగా ధర చెల్లించాల్సి ఉంటుంది.
- ఆయిల్ కంపెనీల నగదు బదిలీ (డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్) ద్వారా సబ్సిడీ మొత్తం అర్హులైన లబ్ధిదారులకు బదిలీ చేస్తాయి. గ్యాస్ కనెక్షన్కు లింక్ అయి ఉన్న అకౌంట్లో నగదు బదిలీ జరుగుతుంది.
- రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారుల కోసం ఎల్పీజీ కంపెనీలకు నెలవారీ ప్రాతిపదికన ముందస్తుగా అడ్వాన్స్ రూపంలో అందిస్తుంది.