- కేవలం రెండు కంపెనీల నుంచే అందుకున్న అదానీ గ్రూప్ బాస్
న్యూఢిల్లీ: దేశంలో రెండో అత్యంత ధనవంతుడిగా పేరొందిన అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ 2023–24 ఆర్థిక సంవత్సరంలో రూ.9.26 కోట్ల రెమ్యునిరేషన్ అందుకున్నారు. ఇండస్ట్రీలోని ఇతర కంపెనీల చైర్మన్లతో పోలిస్తే ఆయన తీసుకున్న శాలరీ తక్కువగా ఉంది. అదానీ గ్రూప్ నుంచి 10 కంపెనీలు మార్కెట్లో లిస్ట్ కాగా, ఇందులోని రెండు కంపెనీల నుంచి గౌతమ్ అదానీ శాలరీ తీసుకున్నారు.
అదానీ ఎంటర్ప్రైజెస్ నుంచి రూ.2.19 కోట్ల శాలరీని, రూ.27 లక్షల విలువైన ఇతర బెనిఫిట్స్ను అందుకున్నారు. ఈ కంపెనీ నుంచి ఆయన తీసుకున్న మొత్తం రెమ్యునిరేషన్ రూ.2.46 కోట్లుగా ఉంది. అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ నుంచి రూ.6.8 కోట్ల రెమ్యునిరేషన్ను అందుకున్నారు. ఇందులో రూ.1.8 కోట్ల శాలరీ, రూ.5 కోట్ల కమీషన్ కలిసి ఉన్నాయి. గౌతమ్ అదానీ కొడుకు కరణ్ అదానీ అదానీ పోర్ట్స్ నుంచి రూ.3.9 కోట్ల రెమ్యునిరేషన్ అందుకున్నారు.
మరోవైపు అదానీ ఎంటర్ప్రైజెస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వినయ్ ప్రకాశ్ రూ.89.37 కోట్ల రెమ్యునిరేషన్ అందుకోవడం విశేషం. రిలయన్స్ చైర్మన్ ముకేశ్ అంబానీ 2022–23 లో రూ.15 కోట్ల రెమ్యునిరేషన్ అందుకోగా, ఎయిర్టెల్ బాస్ సునీల్ మిట్టల్ రూ.16.7 కోట్లు, బజాజ్ ఆటో రాజీవ్ బజాజ్ రూ.53.7 కోట్లు, హీరో మోటోకార్ప్ పవన్ ముంజల్ రూ.80 కోట్ల రెమ్యునిరేషన్ను అందుకున్నారు. బ్లూమ్బర్గ్ రిచ్లిస్టులో 14 వ ప్లేస్లో గౌతమ్ అదానీ (106 బిలియన్ డాలర్లు), 12 వ ప్లేస్లో ముకేశ్ అంబానీ (111బిలియన్ డాలర్లు) ఉన్నారు.