తాటి, ఈత కల్లుతో వైన్​ ..సీఎం రేవంత్​తో జర్మన్ ప్రతినిధి స్టీఫెన్ భేటీ 

తాటి, ఈత కల్లుతో వైన్​ ..సీఎం రేవంత్​తో జర్మన్ ప్రతినిధి స్టీఫెన్ భేటీ 
  • అనుబంధ ఉత్పత్తుల పరిశ్రమ ఏర్పాటు చేస్తామని వెల్లడి
  • కాంబోడియా టూర్​లో పరిశ్రమ ఏర్పాటుపై  స్టీఫెన్​ను కోరిన మంత్రి పొన్నం

హైదరాబాద్, వెలుగు: తాటి, ఈత చెట్ల నుంచి వచ్చే కల్లుతో వైన్, అరక్ తదితర అనుబంధ పదార్థాల తయారీ పరిశ్రమను రాష్ట్రంలో ఏర్పాటు చేస్తామని జర్మన్ ప్రతినిధి స్టీఫెన్ తెలిపారు. ఇందుకు తగిన సౌకర్యాలు కల్పించాలని సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కోరారు. గురువారం అసెంబ్లీలో సీఎం, డిప్యూటీ సీఎంను స్టీఫెన్ కలిశారు.

గతంలో మంత్రి పొన్నం ప్రభాకర్, పీసీసీ చీఫ్ మహేశ్​ కుమార్ గౌడ్, ఫ్రొఫెసర్ జానయ్య కాంబోడియా స్టడీ టూర్​కు వెళ్లినపుడు అక్కడ ఈ తరహా పరిశ్రమ ఎంతోమందికి ఆర్థికంగా ఉపాధి కల్పిస్తున్న అంశాన్ని వారు గమనించారు. తెలంగాణలో ఇలాంటి పరిశ్రమ ఏర్పాటుకు సహకరించాలని ఆ సమయంలో స్టీఫెన్​తో సమావేశమై కోరారు.

వారి కోరిక మేరకు రాష్ట్రానికి వచ్చిన స్టీఫెన్ తెలంగాణలో తాటి, ఈత కల్లుతో వైన్, అరక్ తదితర అనుబంధ ఉత్పత్తులు తయారు చేసే పరిశ్రమ ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డికి తెలిపారు. ఈ పరిశ్రమ తెలంగాణాలో ఏర్పాటు చేయడం వల్ల గీత కార్మికుల ఆర్థికాభివృద్ధికి తోడ్పడుతుందన్నారు. అలాగే, వాల్యూ అడిషన్, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని వివరించారు.

తెలంగాణ కల్లు యూరప్​కు ఎగుమతి చేసే అవకాశం లభిస్తుందని.. అలాగే, స్థానికంగాను వాటి ఉత్పత్తులు విక్రయాలు చేపట్టొచ్చన్నారు. గీత కార్మికుల ఆదాయం పెరుగుతుందన్నారు. కల్లు ఆధారిత ఉత్పత్తు ఇతర దేశాల్లో మార్కెటింగ్ చేయొచ్చన్నారు. అలాగే, రీసెర్చ్, డెవలప్మెంట్ విభాగం ఏర్పాటు చేసి త్వరగా పెరిగి అధిక దిగుబడిని ఇచ్చే తాటి, ఈత విత్తనాల తయారీకి కూడా తాము సిద్ధంగా ఉన్నట్లు స్టీఫెన్ వివరించారు. ఈ సమావేశంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పీసీసీ చీఫ్​మహేశ్ కుమార్ గౌడ్, పారిశ్రామిక వేత్త రోహిత్ పాల్గొన్నారు.