
- హైకమాండ్ మెప్పు కోసం ఇష్టారీతిన ప్రవర్తించారు
- కాంగ్రెస్ కార్పొరేటర్లు ఫైర్
- బీఆర్ఎస్ మహిళా కార్పొరేటర్లు గోర్లలో విషం పెట్టుకుని దాడి చేశారు
- మాజీ డిప్యూటీ మేయర్బాబా ఫసియొద్దీన్ ఆరోపణ
హైదరాబాద్ సిటీ, వెలుగు : కౌన్సిల్ సమావేశంలో బీఆర్ఎస్ కార్పొరేటర్లు రౌడీల్లా వ్యవహరించారని కాంగ్రెస్ కార్పొరేటర్లు మండిపడ్డారు. శుక్రవారం జీహెచ్ఎంసీ హెడ్డాఫీసులో మేయర్విజయలక్ష్మితో సమావేశమై కౌన్సిల్ మీటింగ్లో జరిగిన ఘటనను వివరించారు. అనంతరం మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియొద్దీన్ మాట్లాడూ.. బీఆర్ఎస్ మహిళా కార్పొరేటర్లు బూతులు తిడుతూ తనపై దాడి చేశారని, గోళ్లలో విషం పెట్టుకుని వచ్చారని ఆరోపించారు. తన చేతికి గాయమైందని తెలిపారు. దాడి వెనుక ఆ పార్టీ వర్కింగ్ప్రెసిడెంట్కేటీఆర్ఉన్నారని ఆరోపించారు.
తాము పార్టీ మారామని అంటున్నవారు.. ఏ పార్టీల నుంచి వచ్చారో చెప్పాలన్నారు. ఎమ్మెల్యే తలసాని, మాగంటి గోపినాథ్, మల్లారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు అప్పట్లో టీడీపీ నుంచి గెలిచి బీఆర్ఆఎస్ చేరలేదా అని నిలదీశారు. అభివృద్ధిని చూడలేక, చర్చించలేక ఇలా దాడికి పాల్పడ్డారని మండిపడ్డారు. కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ దర్పల్లి రాజశేకర్ రెడ్డి మాట్లాడుతూ అభివృద్ధిని చూసి బీఆర్ఎస్తట్టుకోలేకపోతుందన్నారు. కౌన్సిల్ లో సిటీ సమస్యలపై సుదీర్ఘ చర్చ జరిగిందన్నారు.
చర్లపల్లి కార్పొరేటర్ బొంతు శ్రీదేవి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ కార్పొరేటర్లు కౌన్సిల్ లో మేయర్ను, సభను గౌరవించకుండా రౌడీల్లా బిహేవ్ చేశారన్నారు. వాళ్ల పార్టీ అధిష్ఠానం మెప్పు కోసం ఇష్టమొచ్చినట్లు ప్రవర్తించారన్నారు. రహయత్ నగర్ కార్పొరేటర్ సీఎన్ రెడ్డి మాట్లాడుతూ.. సభను రాష్ట్రమంతా చూసిందని, ప్రజా సమస్యలను చర్చించకుండా గుండాల్లా ప్రవర్తించడం కరెక్ట్కాదన్నారు.
బీఆర్ఎస్ కార్పొరేటర్ల నిరసన
ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేసేలా కౌన్సిల్ మీటింగులో మేయర్ విజయలక్ష్మి వ్యవహరించారంటూ శుక్రవారం బీఆర్ఎస్ కార్పొరేటర్లు జీహెచ్ఎంసీ హెడ్డాఫీస్వద్ద నిరసన తెలిపారు. తర్వాత మేయర్ చాంబర్ ముందు బైఠాయించి ఆమెకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కమిషనర్ అందుబాటులో లేకపోవడంతో అడిషనల్ కమిషనర్ కు వినతిపత్రం అందజేశారు.
బీఆర్ఎస్మహిళా కార్పొరేటర్లపై దాడి చేసిన కాంగ్రెస్కార్పొరేటర్లపై చర్యలు తీసుకోవాలని కోరారు. తమను బలవంతంగా మార్షల్స్ తో బయటకు పంపించారన్నారు. ఏకపక్షంగా బడ్జెట్ ఆమోదించారని మండిపడ్డారు. కార్పొరేటర్లు రవీందర్ రెడ్డి, నరసింహ యాదవ్, శ్రీనివాసరావు, విజయశాంతి పాల్గొన్నారు.