![కుళ్లిన కూరగాయలు.. కిచెన్లో బొద్దింకలు.. హైదరాబాద్లో బయటపడ్డ ఫేమస్ హోటళ్ల నిర్వాకం](https://static.v6velugu.com/uploads/2025/02/ghmc-food-safety-officials-conducted-inspections-in-hyderabad_AdKB3tqcmN.jpg)
హైదరాబాద్: వివిధ రకాల వంటకాలకు బ్రాండ్ అయిన హైదరాబాద్లో రోజు రోజుకు ఆహార కల్తీ ఘటనలు పెరిగిపోతున్నాయి. నిత్యం ఏదో ఒక చోట ఫుడ్ కల్తీ ఘటనలు వెలుగు చూస్తు్న్నాయి. బిర్యానీలో బల్లి.. సాంబార్లో బొద్దింక వంటి వార్తలు నిత్యం వినిపిస్తున్నాయి. ధనార్జనే లక్ష్యంగా కొందరు హోటళ్ల నిర్వాహకులు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. కుళ్లిన కూరగాయలు.. ఎక్స్ఫైరీ ముగిసిన పదార్థాలతో వంటలు చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. దీంతో బయట ఫుడ్ తినాలంటేనే నగరవాసులు జంకే పరిస్థితి తలెత్తింది.
ఆహార కల్తీ ఘటనలు రోజు రోజుకు పెరిగిపోతుండటంతో ఫుడ్ సేఫ్టీ అధికారులు దూకుడు పెంచారు. నగరంలో నిత్యం ఏదో ఒక చోట తనిఖీలు చేయడంతో పాటు.. కస్టమర్ల నుంచి ఫిర్యాదు వచ్చిన వెంటనే అక్కడి వెళ్లి సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే సోమవారం (ఫిబ్రవరి 10) హైదరాబాద్ సిటీలోని పలు ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు చేశారు. రాజేంద్ర నగర్లోని ది ఫోర్ట్, డెలిష్ బై హోమ్స్ కిచెన్ రెస్టారెంట్లో అధికారులు చెక్ చేశారు.
తనిఖీల్లో భాగంగా.. ఈ రెండు హాటల్స్ ఫుడ్ సేఫ్టీ నిబంధనలు పాటించట్లేదని అధికారులు గుర్తించారు. కిచెన్ పరిసరాలు అపరిశుభ్రంగా ఉండటంతో పాటు.. కుళ్లిపోయిన కూరగాయలు వాడుతున్నట్లు గుర్తించి హోటల్ నిర్వాహకులపై అధికారులు మండిపడ్డారు. ఏకంగా కిచెన్లో బొద్దింకలు తిరుగుతుండటంతో చూసిన అధికారులు.. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రెస్టారెంట్లో గడువు ముగిసిన ఫుడ్ ఇన్గ్రీడియంట్స్ వాడుతున్నట్లు గుర్తించిన అధికారులు వాటిని సీజ్ చేశారు. ఫుడ్ సేఫ్టీ నిబంధనలు పాటించకపోవడంతో రెస్టారెంట్ నిర్వాహకులకు ఫుడ్ సేఫ్టీ అధికారులు నోటీసులిచ్చారు. ఇకపై ఇలాంటి మళ్లీ పునరావృతం అయితే సీరియస్ యాక్షన్ తీసుకుంటామని హెచ్చరించారు. ఫుడ్ కల్తీ చేసి ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడొద్దని వార్నింగ్ ఇచ్చారు ఫుడ్ సేఫ్టీ అధికారులు.