జనాభా కోటిన్నర.. స్టాఫ్ 31 వేలు! GHMCని పీడిస్తున్న సిబ్బంది కొరత

జనాభా కోటిన్నర.. స్టాఫ్ 31 వేలు! GHMCని పీడిస్తున్న సిబ్బంది కొరత
  • లక్షన్నరకు ఉన్నది ఐదు వంతులే.. 
  • ఉన్న ఉద్యోగులు, కార్మికులపై పని భారం 
  • రాష్ట్రం ఏర్పడ్డాక ఒక్కరినీ తీసుకోని బీఆర్ఎస్​
  • 100 మంది ఇంజినీర్లను ఇచ్చి సైలెంట్​అయిన కాంగ్రెస్​సర్కార్​
  • మనకన్నా ఇతర రాష్ట్రాల్లోని నగరాలే బెటర్

హైదరాబాద్ సిటీ, వెలుగు:జీహెచ్ఎంసీలో స్టాఫ్ తక్కువగా ఉండటంతో ఉన్న ఉద్యోగులపై ఒత్తిడి పెరుగుతోంది. కోటిన్నర జనాభాఉన్న గ్రేటర్​కు ఔట్​సోర్సింగ్, పర్మినెంట్​ఉద్యోగులు కలిపి సుమారు లక్ష మంది వరకు అవసరం ఉండగా, 31 వేల మంది మాత్రమే పనిచేస్తున్నారు. ఈ విషయంలో మనం ముంబై, బెంగళూర్, చెన్నై తదితర నగరాలతో పోలిస్తే వెనకబడే ఉన్నాం. అక్కడ జనాభాకు సరిపడే విధంగా ఇక్కడున్న స్టాఫ్​తో పోలిస్తే  రెండితలు, కొన్నిచోట్ల మూడింతల స్టాఫ్ కూడా ఉన్నారు. 

పుణే లాంటి చిన్న నగరంలో కూడా మనకంటే ఎక్కువగానే స్టాఫ్ ఉన్నారు. ఈ పరిస్థితి నుంచి అధిగమించేందుకు కనీసం ఔట్​సోర్సింగ్​ఉద్యోగులను తీసుకుంటున్నారా అంటే అదీ లేదు. 15 ఏండ్లుగా బల్దియాలోకి ఔట్​సోర్సింగ్ పద్ధతిన ఒక్కరిని కూడా తీసుకోలేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోచ్చు. సిటీని శుభ్రంగా ఉంచేందుకు శ్రమించే శానిటేషన్​వర్కర్లు, కీలకమైన టౌన్​ప్లానింగ్ లో కూడా ఉద్యోగుల కొరత వేధిస్తున్నది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత వేసిన ప్రసాద్​ రావు కమిటీ, ఆల్​పార్టీ కమిటీలు 60 శాతం ఖాళీలున్నాయని, తక్షణమే స్టాఫ్​ను పెంచాలని సూచించినా పట్టించుకోవడం లేదు. తెలంగాణ ఏర్పడిన తర్వాత అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్​ ఈ విషయాన్ని లెక్క చేయలేదు. 

పైగా రిటైర్​అయిన వారినే ఔట్ సోర్సింగ్ పద్ధతిలో కొనసాగించేందుకు అనుమతి ఇచ్చి నిరుద్యోగులకు మొండి చేయి చూపింది. కాంగ్రెస్​ ప్రభుత్వం ఏర్పడిన తరువాత రిటైర్ట్ అయిన వారిని తొలగించింది. రెండు నెలల కింద వంద మంది ఇంజినీర్లను కేటాయించింది. కానీ, మిగతా విభాగాల్లో ఏ మార్పూ రాలేదు. ఉన్న పనితో పాటు ప్రజాపాలన దరఖాస్తులు, ఇందిరమ్మ ఇండ్ల సర్వే, రేషన్ కార్డులు ఇలా ఏ కార్యక్రమమైనా ఉన్నవారితోనే చేయిస్తున్నారు. 

లక్షకు వేయి మంది ఉండాలె...

నగరం క్లీన్​అండ్​ గ్రీన్​గా ఉంచడంతో పాటు ట్యాక్స్​లు వసూలు  చేయడం, సిటిజన్స్​ సేవల కోసం బల్దియాకు ఎంత లేదన్నా లక్షకు వేయి మంది స్టాఫ్ అవసరముంటుంది. కానీ, ప్రస్తుతం 4 వేల మంది పర్మినెంట్​ఎంప్లాయీస్​, 27 వేల మంది ఔట్​సోర్సింగ్ సిబ్బంది మాత్రమే పనిచేస్తున్నారు. సిటీలో రోజూ అన్ని రోడ్లు క్లీన్​ చేయాలంటే దాదాపు 50 వేల శానిటేషన్​వర్కర్స్​అవసరం ఉంటుంది. అయితే, గ్రేటర్​ వ్యాప్తంగా 18,500 మంది కార్మికులే పని చేస్తున్నారు. వీరు వీఐపీలు తిరిగే మెయిన్​రోడ్లను ఊడ్చేసరికే టైం అయిపోతోంది. 

కొన్ని కాలనీల్లో రెండు, మూడు రోజులకు ఒకసారి కానీ ఊడ్వడం లేదు. అలాగే కీలమైన  ఎంటమాలజీలోనూ ఇదే పరిస్థితి ఉంది. ఈ శాఖలో కేవలం 2,292 మంది ఔట్​సోర్సింగ్​స్టాఫ్ మాత్రమే పనిచేస్తున్నారు. ఈ రెండు వేల మందే సుమారు కోటిన్నర మందికి దోమలు కరవకుండా, వ్యాధులు రాకుండా చూసుకోవాల్సి వస్తోంది. వర్కర్ల స్థానంలో యంత్రాలతో క్లీన్ చేయిద్దామంటే ఆ పనులు చేయకుండానే బిల్లులు చెల్లిస్తున్నారు.  

కమిషనర్ ఫోకస్..

ఉద్యోగుల కొరతపై కమిషనర్ ఇలంబరితి ఫోకస్ పెట్టారు. కొన్ని  పోస్టుల భర్తీకి ప్రభుత్వ అనుమతులు లేవని, అప్రూవల్ కోసం ప్రయత్నిస్తామని చెప్పారు. ఏ ఏ శాఖలో ఎంత మంది అవసరం ఉంది? ప్రస్తుతం ఎంతమంది భర్తీ చేస్తే ఉద్యోగులపై ఒత్తిడి తగ్గుతుంది అన్న విషయాలపై స్టడీ చేస్తున్నారు. ఒక అంచనాకు వచ్చిన తర్వాత ప్రభుత్వానికి లెటర్ రాయనున్నట్లు తెలిసింది.