పార్కు స్థలంలో ప్రైవేటు కమ్యూనిటీ హాలేంటి

పార్కు స్థలంలో ప్రైవేటు కమ్యూనిటీ హాలేంటి
  •  జీహెచ్‌ఎంసీని నిలదీసిన హైకోర్ట్ 

హైదరాబాద్, వెలుగు : నాంపల్లిలోని 45వ వార్డులో ఉన్న పార్కు స్థలంలో ప్రైవేటు కమ్యూనిటీ హాల్‌ ఎలా నిర్మిస్తున్నారో చెప్పాలని జీహెచ్‌ఎంసీని హైకోర్టు ఆదేశించింది. సర్వే నెం.24లో పార్కును ధ్వంసం చేసి కమ్యూనిటీ హాల్‌ కడుతుంటే అధికారులు పట్టించుకోవడం లేదని షాహినాథ్‌గంజ్‌కు చెందిన రహీం బిన్‌ హుస్సేన్‌ వేసిన పిల్‌ను చీఫ్‌ జస్టిస్‌ అలోక్‌ అరాధే, జస్టిస్‌ జె.అనిల్‌కుమార్‌లతో కూడిన డివిజన్‌ బెంచ్‌ విచారించింది. 

పార్కు స్థలంలో డి.హనుమదాస్‌ అనే వ్యక్తి కమ్యూనిటీ హాలు నిర్మాణాన్ని చేపట్టారని లాయర్‌ చెప్పారు. ఆఫీసర్లకు రెండుసార్లు వినతి పత్రం ఇచ్చినా చర్యల్లేవన్నారు. దీంతో జీహెచ్‌ఎంసీ కమిషనర్, సహాయ సిటీ ప్లానర్, నాంపల్లి తహసీల్దార్, షాహినాథ్‌గంజ్‌ పోలీసు ఇన్‌స్పెక్టర్, డి.హనుమాన్‌ దాస్‌లకు కోర్టు నోటీసులు జారీ చేసింది.