
- ఉమ్మడి జిల్లాలో గతేడాదికంటే మెరుగుగా ఇంటర్ ఉత్తీర్ణత శాతం
- నిజామాబాద్ జిల్లా స్టేట్లో 25వ స్థానం
- చివరి స్థానంలో నిలిచిన కామారెడ్డి జిల్లా
నిజామాబాద్/కామారెడ్డి, వెలుగు : ఇంటర్ పరీక్షా ఫలితాల్లో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో బాలికలే పైచేయి సాధించారు. ప్రథమ, ద్వితీయ, ఒకేషనల్ కోర్సుల్లోనూ గర్ల్స్ ఆధిపత్యం చాటారు. గతేడాది కంటే ఉత్తీర్ణత శాతం పెరిగింది. నిజామాబాద్ జిల్లాలో ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు మొత్తం 13,945 మంది రాయగా, అందులో 8,117 (58.20 శాతం) మంది పాస్ అయ్యారు. వారిలో గర్ల్స్ 5,309 కాగా, బాయ్ 2,808 మంది ఉన్నారు.
ఫస్ట్ ఇయర్లో 15,056 మంది పరీక్షలు రాయగా, 8,035 మంది పాస్ (53.37 శాతం) అయ్యారు. అందులో గర్ల్స్ 5,191 కాగా, బాయ్స్ 2,844 మంది ఉన్నారు. ఒకేషనల్ ఫస్ట్ ఇయర్ పరీక్షలకు 2,790 మంది స్టూడెంట్స్ అటెండ్ కాగా, 1,223 మంది పాస్ (43.83 శాతం) అయ్యారు. వారిలో గర్ల్స్ సంఖ్య 756 కాగా, బాయ్స్ 467 మంది ఉన్నారు. సెకండ్ ఇయర్ ఒకేషనల్ ఎగ్జామ్ రాసిన మొత్తం స్టూడెంట్స్ 2,042 కాగా, 1,231మంది (60.28 శాతం) ఉత్తీర్ణత సాధించారు. అందులో బాలికలు 666, బాయ్స్ 565 మంది ఉన్నారు.
ఉత్తమ మార్కులు సాధించిన సర్కార్ స్టూడెంట్స్..
ఇంటర్మీడియెట్ పరీక్షా ఫలితాల్లో జిల్లాలోని గవర్నమెంట్ కాలేజీ స్టూడెంట్స్ ఉత్తమ మార్కులు సాధించి ప్రతిభను చాటుకున్నారు. ఇందూర్ గర్ల్స్ జూనియర్ కాలేజీకి చెందిన మలిహ ఆర్ఫీన్ (బైపీసీ 974/1,000), బి.జోతిర్మయి (ఎంపీసీ 956/1,000), ఆర్మూర్ గవర్నమెంట్ గర్ల్స్ కాలేజీలో సోఫియా కుల్సుం (బైపీసీ 967/1,000), మనస్విని (932/1,000) , ఒకేషనల్ కోర్సులో ఎస్.పూజ (974/1,000) పొందారు. వారిని డీవీఈవో రవికుమార్ అభినందించారు.
కామారెడ్డి జిల్లాలో..
జిల్లాలో ఈసారి సెకండ్ ఇయర్లో 54.93 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఫస్ట్ ఇయర్లో 48.96 శాతం మంది పాసయ్యారు. కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ స్పెషల్ ఫోకస్ పెట్టారు. గవర్నమెంట్ జూనియర్ కాలేజీ విద్యార్థులు, తల్లిదండ్రులు, లెక్చరర్లతో మీటింగ్లు నిర్వహించారు. ఆయా సబ్జెక్టుల్లో వెనుకబడిన వారిపై లెక్చరర్లు ప్రత్యేక శ్రద్ధ చూపారు. ఈ ఏడాది సెకండ్ ఇయ్యర్లో 6,485 మంది పరీక్షకు హాజరు కాగా, వీరిలో 3,562 మంది పాసయ్యారు.
ఇందులో బాలురు 3,026 మందిలో 1,347 మంది ఉత్తీర్ణులయ్యారు. బాలికలు 3,459 మందికిగాను 2,215 మంది పాసయ్యారు. ఒకేషనల్లో 1,237 మందికి గాను 792 మంది ( 64 శాతం) పాసయ్యారు. ఫస్ట్ ఇయర్లో మొత్తం 6,828 మంది స్టూడెంట్స్లో 3,343 మంది పాసయ్యారు. వీరిలో బాలురు 3,119 మందిలో 1,169 మంది, బాలికలు 3,709 మందిలో 2,174 మంది పాసయ్యారు. ఒకేషనల్లో 1,912 మందిలో 1,030 మంది ( 54.13 శాతం) ఉత్తీర్ణులయ్యారు. గవర్నమెంట్ జూనియర్ కాలేజీల్లో చాలా చోట్ల ఉత్తీర్ణత శాతం తక్కువగా ఉంది. కస్తూర్బా, మాడల్ కాలేజీల్లోని విద్యార్థులకు మెరుగైన మార్కులు వచ్చాయి.