- 25 వేల లెవెల్ నుంచి ఒక శాతం పతనమైన నిఫ్టీ
- రూ.4.5 లక్షల కోట్లు తగ్గిన ఇన్వెస్టర్ల సంపద
ముంబై : వరుసగా ఐదు సెషన్లలో పెరిగిన బెంచ్మార్క్ ఇండెక్స్లు శుక్రవారం భారీగా పడ్డాయి. యూఎస్ ఎకనామిక్ డేటా మెప్పించకపోవడంతో మెటల్, ఆటో, ఐటీ షేర్లలో అమ్మకాల ఒత్తిడి కనిపించింది. యూఎస్ ఐఎస్ఎం మాన్యుఫాక్చరింగ్ ఇండెక్స్ జున్లో 48.8 ఉండగా, జులైలో 46.6 కి తగ్గింది. ఫలితంగా ఈ దేశ ఎకానమీ రెసిషన్లోకి జారుకుంటుందనే భయాలు మళ్లీ మొదలయ్యాయి. 30 షేర్లున్న సెన్సెక్స్ శుక్రవారం 886 పాయింట్లు (1.08 శాతం) పతనమై 80,982 దగ్గర ముగిసింది. 25 షేర్లు నష్టాల్లో క్లోజవ్వగా, ఐదు షేర్లు లాభపడ్డాయి.
నిఫ్టీ కూడా 25 వేల లెవెల్ నుంచి వెనుదిరిగింది. ఈ బెంచ్మార్క్ ఇండెక్స్ 293 పాయింట్లు తగ్గి 24,718 దగ్గర సెటిలయ్యింది. సెన్సెక్స్లో మారుతి సుజుకీ , టాటా మోటార్స్, జేఎస్డబ్ల్యూ స్టీల్, లార్సెన్ అండ్ టూబ్రో, టాటా స్టీల్, మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, టెక్ మహీంద్రా, హెచ్సీఎల్ టెక్నాలజీస్, ఇన్ఫోసిస్ షేర్లు ఎక్కువగా పడ్డాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, సన్ ఫార్మా, కోటక్ బ్యాంక్, నెస్లే ఇండియా, ఏషియన్ పెయింట్స్ షేర్లు లాభపడ్డాయి. ఇన్వెస్టర్లు శుక్రవారం రూ.4.5 లక్షల కోట్లు నష్టపోయారు.
బీఎస్ఈ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.58 శాతం తగ్గగా, మిడ్క్యాప్ ఇండెక్స్ 1.19 శాతం పడింది. రియల్టీ, మెటల్, ఆటో ఇండెక్స్లు మూడున్నర శాతం వరకు పడ్డాయి. ఐటీ, కమోడిటీస్, టెక్, క్యాపిటల్ గూడ్స్ ఇండెక్స్లు కూడా భారీ పతనాన్ని చూశాయి. ఒక్క హెల్త్కేర్ ఇండెక్స్ మాత్రమే లాభాల్లో ముగిసింది. గ్లోబల్గా చూస్తే టోక్యో, షాంఘై, హాంకాంగ్, సియోల్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. యూరోపియన్ మార్కెట్లు నెగెటివ్లో కదిలాయి.
ఎనలిస్టులు ఏమంటున్నారంటే?
1) గ్లోబల్గా స్టాక్ మార్కెట్లు పడడంతో మన మార్కెట్ కూడా నష్టపోయిందని మెహతా ఈక్విటీస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ప్రశాంత్ తాప్సే అన్నారు. తాజాగా మార్కెట్ పెరగడంతో ఇండియన్ స్టాక్స్ వాల్యుయేషన్ ఎక్కువగా ఉందని, కరెక్షన్ రావొచ్చని వివరించారు. ఎకానమీ స్ట్రాంగ్గా ఉండడంతోపాటు, కార్పొరేట్ కంపెనీల రిజల్ట్స్ బాగుండడంతో మార్కెట్ పతనం పరిమితంగా ఉందని అభిప్రాయపడ్డారు.
2) యూఎస్ ఐటీ కంపెనీల రిజల్ట్స్ వీక్గా ఉన్నాయని, నిరుద్యోగం పెరిగే చాన్స్ ఉండడం, బ్యాంక్ ఆఫ్ జపాన్ వడ్డీ రేట్లను పెంచనుండడం, చైనా ఎకానమీ గ్రోత్ నెమ్మదించడం వంటి అంశాలు మార్కెట్ పతనానికి కారణమయ్యాయని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎనలిస్ట్ వినోద్ నాయర్ అన్నారు. ఇప్పటి వరకు వచ్చిన కంపెనీల జూన్ క్వార్టర్ ఫలితాలు పెద్దగా మెప్పించలేకపోయాయని, మరోవైపు మార్కెట్ వాల్యుయేషన్ ఎక్కువగా ఉందని పేర్కొన్నారు.
3) యూరోపియన్ మార్కెట్లు శుక్రవారం ఒక శాతానికి పైగా నష్టపోయాయని, యూఎస్ ఎకానమీ రెసిషన్లోకి జారుకుంటుందనే భయాలు మొదలయ్యాయని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ ఎనలిస్ట్ దీపక్ జసానీ అన్నారు. జపనీస్ సెంట్రల్ బ్యాంక్ వడ్డీ రేట్లను పెంచడానికి రెడీ అవుతుండడంతో ఈ దేశ స్టాక్ మార్కెట్లు పడ్డాయని వివరించారు. అంతేకాకుండా టెక్ కంపెనీల ఔట్లుక్ ఆందోళన కలిగిస్తోందని అన్నారు.