ఆటో డ్రైవర్‎తో గొడవ.. నిమిషాల్లోనే కుప్పకూలి చనిపోయిన మాజీ ఎమ్మెల్యే.. అసలేం జరిగింది..?

ఆటో డ్రైవర్‎తో గొడవ.. నిమిషాల్లోనే కుప్పకూలి చనిపోయిన మాజీ ఎమ్మెల్యే.. అసలేం జరిగింది..?

బెంగుళూరు: కర్ణాటకలోని బెళగావి జిల్లాలో మాజీ ఎమ్మెల్యే లావూ మామ్లేదార్ అనుమానస్పద స్థితిలో మృతి చెందారు. ఓ ఆటో డ్రైవర్‎తో వాగ్వాదం జరిగిన నిమిషాల్లోనే ఆయన కన్నుమూశారు. మాజీ ఎమ్మెల్యే అనుమానస్పద మృతిపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అధికారుల వివరాల ప్రకారం.. 
మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ మాజీ ఎమ్మెల్యే లావూ మామ్లేదార్ వాహనం శనివారం (ఫిబ్రవరి 15) బెళగావి పట్టణంలోని శ్రీనివాస్ లాడ్జ్ సమీపంలో ఓ ఆటోను ఢీకొట్టింది. దీంతో మాజీ ఎమ్మెల్యే మామ్లేదార్, ఆటో డ్రైవర్‎కు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. 

ALSO READ | యూపీలో మరో రోడ్డు ప్రమాదం..ట్రక్కును ఢీకొన్న బస్సు..రెండు వెహికల్స్ మంటల్లో దగ్ధం

దీంతో విచక్షణ కోల్పోయిన మామ్లేదార్ ఆటో డ్రైవర్‎పై చేయి చేసుకున్నాడు. ఆటో డ్రైవర్ కూడా తిరిగి మాజీ ఎమ్మెల్యేపై దాడి చేశాడు. ఇరువురి మధ్య మొదలైన ఘర్షణ హింసాత్మకంగా మారడంతో వెంటనే కలగజేసుకున్న స్థానికులు ఇద్దరిని సముదాయించారు. అనంతరం మామ్లేదార్ లాడ్జికి వెళ్లిపోయారు. ఈ క్రమంలో లాడ్జి మెట్లు ఎక్కతుండగానే మామ్లేదార్ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. గమనించిన లాడ్జి సిబ్బంది ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. మామ్లేదార్‎పై దాడి చేసిన ఆటో డ్రైవర్‎ను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. మామ్లేదార్ మృతికి స్పష్టమైన కారణం ఏంటన్నది ఇంకా తెలియరాలేదని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. కాగా, మామ్లేదార్ 2012 నుంచి 2017 వరకు గోవాలోని పోండా నియోజకవర్గ ఎమ్మెల్యేగా పని చేశారు.