
- వేసవి దృష్ట్యా విడుదల చేసిన ఇరిగేషన్ అధికారులు
భద్రాచలం,వెలుగు : భద్రాద్రి జిల్లా అశ్వాపురం మండలం బీజీ కొత్తూరు పంపుహౌస్ నుంచి గోదావరి నీటిని గురువారం కాల్వలకు ఇరిగేషన్ అధికారులు విడుదల చేశారు. ఎగువన తుపాకులగూడెం సమ్మక్క బ్యారేజీ నుంచి 1200 క్యూసెక్కుల నీరు చేరుకుంది. దుమ్ముగూడెం ఆనకట్ట మీదుగా దిగువకు వృథాగా జలాలు పోతుండగా.. రోజుకు రెండు గంటల పాటు పంపుహౌస్ను స్టార్ట్ చేసి 40 కిలోమీటర్ల మేర కాల్వల్లో నింపుతున్నారు.
వేసవి దృష్ట్యా జిల్లాలోని నాగార్జున సాగర్ప్రాజెక్టు కెనాల్కు నీటిని చేర్చనున్నారు. జిల్లాలో వేసవి అవసరాలు తీర్చేలా కాల్వ మొత్తం గోదావరి జలాలను సరఫరా చేయనున్నారు. బీజీ కొత్తూరు వద్ద ఉన్న తొలి పంపుహౌస్ వద్ద ఇంజనీర్ శ్రీనివాస్ఆధ్వర్యంలో పంపింగ్ను పరిశీలిస్తున్నారు.