ఎన్టీపీసీ పొగ, దుమ్ముతో బతకలేకపోతున్నం!

ఎన్టీపీసీ పొగ, దుమ్ముతో  బతకలేకపోతున్నం!
  • ‘ఖని’ మాతంగి కాలనీవాసుల ఆందోళన
  • వేరే ప్రాంతానికి తరలించాలని వేడుకోలు
  • అయినా పట్టించుకోని ఎన్టీపీసీ మేనేజ్ మెంట్ 
  • ఇష్యూను పార్లమెంట్​లో ప్రస్తావించిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ
  • మాతంగి కాలనీని తరలించాలి 
  • పార్లమెంటులో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ

గోదావరిఖని, వెలుగు : రామగుండం ఎన్టీపీసీ వెదజల్లే కాలుష్యంతో మాతంగి కాలనీ వాసులు సతమతమవుతున్నారు. రోగాల బారిన పడుతున్నామని, తమ కాలనీని తరలించాలని కోరుతున్నారు. ఉమ్మడి ఏపీ పునర్విభజన చట్టంలో భాగంగా 1,600 మెగావాట్ల ప్లాంట్​ఇప్పటికే ప్లాంటును నిర్మించారు. 

తాజాగా మరో 2,400 మెగావాట్ల పవర్​ప్లాంట్​ఏర్పాటుకు ఇటీవలే పబ్లిక్​హియరింగ్​నిర్వహించారు. ఇప్పటికే ఏర్పాటైన ప్లాంటు నుంచి వచ్చే కాలుష్యంతో తట్టుకోలేకపోతున్నామని, ఇక కొత్త ప్లాంట్​కూడా మొదలైతే బతకడం కష్టమని, మరో చోటకు తరలించాలని కాలనీ వాసులు వేడుకుంటున్నారు. 

మరోవైపు కాలుష్యంపై ఎన్టీపీసీ మేనేజ్​మెంట్​నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. కాగా.. మాతంగి కాలనీని సురక్షిత ప్రాంతానికి తరలించి, ఆర్అండ్ఆర్​ప్యాకేజీ వర్తింపజేసి ఆదుకోవాలని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పార్లమెంట్​లో మాట్లాడారు. అదేవిధంగా ఇటీవల జరిగిన పబ్లిక్​ హియరింగ్​లోనూ కాలనీ వాసుల ఇబ్బందులపైనా రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్​ఠాకూర్​ప్రస్తావిస్తూ.. ఆదుకునేలా ఎన్టీపీసీ చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు. 

 తెలంగాణలో 4 వేల మెగావాట్లతో ప్లాంట్లు

2014 లో తెలంగాణ ఏర్పాటు తర్వాత 4 వేల మెగావాట్ల విద్యుత్​ప్లాంట్లను ఎన్టీపీసీ నిర్మించాలని పునర్విభజ న చట్టంలో పొందుపరిచారు. అందుకనుగుణంగా రామగుండం ఎన్టీపీసీ ప్లాంట్​ఆవరణలోని ఖాళీ జాగాలో 2017లో ఫస్ట్​ఫేజ్​కింద 1,600 (800 మెగావాట్లతో రెండు యూనిట్లు) మెగావాట్ల సూపర్​క్రిటికల్​ప్లాంట్​ను నిర్మించారు. మిగిలిన 2,400 ( 800 మెగావాట్లతో మూడు యూనిట్లు) మెగావాట్ల ప్లాంట్​నిర్మాణానికి ఇటీవల పబ్లిక్​హియరింగ్​నిర్వహించారు. ఫేజ్​–1 ప్రాజెక్ట్​కు ఆనుకుని మాతంగి కాలనీ ఉంది. ఇక్కడ సుమారు 300 కుటుంబాలు నివసిస్తున్నాయి. ప్లాంట్​నుంచి బొగ్గు, దుమ్ము వెలువడుతుండడంతో పాటు శబ్ధ కాలుష్యం విపరీతంగా వస్తోంది. దీంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనికి తోడు ఫేజ్​–2 కింద మరో 2,400 మెగావాట్ల ప్లాంట్​ద్వారా వెలువడే కాలుష్యంతో ఇక తట్టుకోలేమని, తమ కాలనీని తరలించాలని పబ్లిక్ హియరింగ్ సందర్భంగా ఎన్టీపీసీ మేనేజ్​మెంట్​దృష్టికి కాలనీవాసులు తీసుకెళ్లినా పట్టించుకోవడంలేదు.

ఎన్టీపీసీ ప్లాంట్​పక్కనే ఉన్న మాతంగి కాలనీ ప్రజలు కాలుష్యంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుండడంతో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ తీవ్రంగా స్పందించారు. మంగళవారం ఆయన పార్లమెంట్​లో ప్రశ్నలు లెవనెత్తారు. ఎన్టీపీసీ విస్తరణతో నష్టపోతున్న కాలనీలోని కుటుంబాలను సురక్షిత ప్రాంతానికి తరలించాలని కోరారు. ఆర్​అండ్​ఆర్​ప్యాకేజీని వారికి వర్తింపచేయాలని, స్థానిక నిరుద్యోగులకు ఎన్టీపీసీలో జాబ్ లు కల్పించాలని కోరారు. కాలనీ సమస్యలపై స్పందించని ఎన్టీపీసీ మేనేజ్​మెంట్​పై తగిన చర్యలు తీసుకోవాలని   డిమాండ్ చేశారు.  అంతకుముందు కేంద్ర విద్యుత్​శాఖ మంత్రి మనోహర్​లాల్​ఖట్టర్​తో ఎంపీ వంశీకృష్ణ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. మాతంగి కాలనీ వాసుల సమస్యలపై కేంద్రమంత్రికి వినతిపత్రం అందజేశారు. 

 కొలువులు రాలే..రోగాలు వస్తున్నయి 

ఎన్టీపీసీ కొత్త ప్లాంట్​ఏర్పడితే మా పిల్లలకు కొలువులు వస్తాయని ఆశించాం. కానీ ప్లాంట్​నుంచి వచ్చే కాలుష్యంతో రోగాల బారిన పడుతున్నాం. ఇప్పటికే మేం పడుతున్న బాధలు పట్టించుకోకపోతే దీక్షలు చేస్తం.  

- భద్రయ్య, మాతంగి కాలనీ వాసి-

కాలనీని తరలించి పునరావాసం కల్పించాలి

ఎన్టీపీసీ కాలుష్యం మా కాలనీవాసులకు శాపంగా మారింది. ఇప్పటికే పొగ, దుమ్ముతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. మళ్ళీ కొత్త ప్లాంట్​లో విద్యుత్​ఉత్పత్తి ప్రారంభమైతే మేం బతుకుడు కష్టమవుతుంది. మా కాలనీని ఇక్కడి నుంచి సురక్షిత ప్రాంతానికి తరలించాలి. పునరావాసం కల్పించాలి. 

- పల్లెర్ల జగన్​ గౌడ్​, మాతంగి కాలనీ-