
హైదరాబాద్, వెలుగు: గోద్రెజ్ ఇండస్ట్రీస్ గ్రూప్కు చెందిన ఆర్థిక సేవల కంపెనీ గోద్రెజ్ క్యాపిటల్ తమ ఫైనాన్స్, హౌసింగ్ ఫైనాన్స్ సంస్థల ద్వారా తెలంగాణ ప్రభుత్వంతో అవగాహనా ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకుంది. ఎంఎస్ఎంఈల ఆర్థిక అభివృద్ధికి ఊతమిచ్చేందుకు ఈ భాగస్వామ్యం దోహదపడనుంది. తొలిసారిగా అప్పు తీసుకుంటున్నవారికి, ముఖ్యంగా లోన్ సదుపాయాలు అంతగా లేనివారికి అప్పులు ఇవ్వడం, ఎంఎస్ఎంఈ వ్యవస్థను బలోపేతం చేయడం ఈ భాగస్వామ్య లక్ష్యమని గోద్రెజ్క్యాపిటల్ప్రకటించింది.
ప్రాపర్టీపై రుణాలు, చిన్న మొత్తాల లోన్లు, లోన్ఎగెనెస్ట్ ప్రాపర్టీ, అన్సెక్యూర్డ్ బిజినెస్ లోన్స్ మొదలైనవి వీటిలో ఉంటాయని తెలిపింది. మహిళల కోసం ఉద్దేశించిన ఆరోహి పథకం ద్వారా మహిళా ఎంట్రప్రెన్యూర్లకు తోడ్పాటు అందించడంపై ప్రత్యేకంగా దృష్టి పెడతామని గోద్రెజ్ క్యాపిటల్ ఎండీ, సీఈవో మనీష్ షా తెలిపారు. ఎంఎస్ఎంఈలకు రుణ లభ్యతను మెరుగుపర్చే దిశగా ఆర్థిక సంస్థలతో ఇలాంటి భాగస్వామ్యాలను కుదుర్చుకోవడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఆ దిశగా ఈ ఎంవోయూ ఒక కీలక ముందడుగు అని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య విభాగం స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేష్ రంజన్ తెలిపారు.