![ట్విట్టర్ లో కొత్త మార్పులు.. డిసెంబరు 2 నుంచి బ్లూ, గోల్డ్, గ్రే టిక్స్](https://static.v6velugu.com/uploads/2022/11/Gold-grey-blue-tick-on-Twitter_NF5iRZPawt.jpg)
ట్విట్టర్ ఖాతాదారులకు సంబంధించిన వెరిఫికేషన్ ఫీచర్ లో ఆ సంస్థ యజమాని ఎలాన్ మస్క్ కీలక మార్పులు చేశారు. ఇవి డిసెంబరు 2 (శుక్రవారం) నుంచి ట్విట్టర్ లో అమల్లోకి రానున్నాయి. ఆ రోజు నుంచి ట్విట్టర్ లో అకౌంట్ కలిగిన కంపెనీలకు గోల్డ్ టిక్, ప్రభుత్వ సంస్థలకు గ్రే టిక్, వ్యక్తులకు (సెలబ్రిటీలు, ఇతరులు) బ్లూ టిక్ను కేటాయిస్తారు.
అకౌంట్లు మ్యానువల్ గా..
అన్ని వేరిఫైడ్ అకౌంట్లు మ్యానువల్ గా ధ్రువీకరణ పొందిన తర్వాతే వాటికి టిక్ ను కేటాయిస్తామని ఎలాన్ మస్క్ స్పష్టంచేశారు. వాస్తవానికి ఈ మార్పులను నవంబరు 29 నుంచే అమల్లోకి తేవాలని భావించినప్పటికీ.. ఆ తర్వాత తేదీని డిసెంబరు 2కు వాయిదా వేశారు.
ఫిర్యాదులు వెల్లువెత్తడంతో..
ట్విట్టర్ ను మస్క్ కొనుగోలు చేయకముందు వరకు ప్రభుత్వ విభాగాల చీఫ్లు, క్రికెటర్లు, మూవీ స్టార్స్, ఇతర రంగాల సెలబ్రిటీల ఖాతాల వివరాలను తనిఖీ చేసి బ్లూటిక్ మంజూరు చేసేవారు. ట్విట్టర్ ను కొనగానే బ్లూటిక్ను మంజూరు చేసేందుకు ప్రతి నెలకు 8 డాలర్ల ఫీజును వసూలు చేయాలని మస్క్ తొలుత నిర్ణయించారు. ఈక్రమంలో 8 డాలర్లు ఇచ్చిన ప్రతి ఒక్కరికీ బ్లూ టిక్ ఇచ్చేశారు. దీంతో ఎన్నో నకిలీ ఖాతాలు బయటపడ్డాయి. వీటిపై ఫిర్యాదులు వెల్లువెత్తడంతో బ్లూటిక్ మంజూరుకు ప్రతినెలా 8 డాలర్ల ఫీజును వసూలు చేసే సర్వీస్ ను మస్క్ వెంటనే నిలిపివేశారు. ఈక్రమంలోనే మూడు రకాల వెరిఫికేషన్ టిక్ లను ఆయన ట్విట్టర్ లో ప్రవేశపెట్టారు. ఈ టిక్ లను మస్క్ ఏ రకంగా జనంలోకి తీసుకెళ్తారనేది వేచి చూడాలి.