
- ఇండియా 41 శాతం పెరిగిన గోల్డ్ దిగుమతులు
- జనవరిలో 2.68 బిలియన్ డాలర్లకు చేరుకున్న ఇంపోర్ట్స్
- బ్యాంకులు, జ్యుయెలర్ల నుంచి ఫుల్ డిమాండ్
- గ్లోబల్గా ట్రేడ్వార్.. బంగారం వైపు చూస్తున్న ఇన్వెస్టర్లు
న్యూఢిల్లీ: ఇండియా గోల్డ్ దిగుమతులు ఈ ఏడాది జనవరిలో ఏకంగా 41 శాతం పెరిగాయి. లోకల్గా డిమాండ్ పెరగడంతో కిందటి నెలలో 2.68 బిలియన్ డాలర్ల విలువైన బంగారాన్ని దిగుమతి చేసుకున్నాం. కిందటేడాది జనవరిలో ఇండియా బంగారం దిగుమతులు 1.9 బిలియన్ డాలర్లుగా రికార్డయ్యాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని ఏప్రిల్–జనవరి మధ్య ఇండియా 50 బిలియన్ డాలర్ల విలువైన గోల్డ్ను దిగుమతి చేసుకోగా, అంతకు ముందు ఆర్థిక సంవత్సరంలో చేసుకున్న 37.85 బిలియన్ డాలర్లతో పోలిస్తే 32 శాతం పెరిగాయి. గ్లోబల్గా టారిఫ్ వార్ నడవడంతో పెట్టుబడులకు సేఫ్ అయిన గోల్డ్ వైపు ఇన్వెస్టర్లు చూస్తున్నారు. కస్టమ్స్ డ్యూటీ తగ్గడంతో గోల్డ్ కొనుగోళ్లు పెరుగుతున్నాయి.
ముఖ్యంగా బ్యాంకులు పెద్ద మొత్తంలో గోల్డ్ను కొనుగోలు చేస్తున్నాయి. గత రెండు నెలల్లో 10 గ్రాముల గోల్డ్ ధర దేశ రాజధానిలో 12 శాతం పెరిగి రూ.89,400 వద్ద జీవిత కాల గరిష్టాన్ని నమోదు చేసింది. గోల్డ్ దిగుమతులు పెరగడంతో ఇండియా కరెంట్ అకౌంట్ డెఫిసిట్ (క్యాడ్– ఖర్చులు మైనస్ ఆదాయం) కూడా పెరుగుతోంది. 2023–24 లో ఇండియా క్యాడ్ 30 శాతం పెరిగి 45.54 బిలియన్ డాలర్లకు చేరుకుంది. కాగా, కిందటి నెలలో స్విట్జర్లాండ్ నుంచి గోల్డ్ ఎక్కువగా దిగుమతి చేసుకున్నాం. మొత్తం బంగారం దిగుమతుల్లో ఈ దేశ వాటా 40 శాతంగా ఉంది. ఆ తర్వాత ప్లేస్లో యూఏఈ (16శాతం), సౌత్ ఆఫ్రికా (10 శాతం) ఉన్నాయి.
ఇండియా మొత్తం దిగుమతుల్లో గోల్డ్ వాటా 5 శాతంగా ఉంది. బంగారం దిగుమతులు పెరగడంతో ఇండియా ట్రేడ్ డెఫిసిట్ (దిగుమతులు మైనస్ ఎగుమతులు) కిందటి నెలలో 22.99 బిలియన్ డాలర్లకు ఎగిసింది. కాగా, గోల్డ్ వినియోగంలో గ్లోబల్గా టాప్2 ప్లేస్లలో ఇండియా ఉంది. జ్యుయెలరీ ఇండస్ట్రీ విస్తరిస్తుండడంతో బంగారం దిగుమతులు పెరుగుతున్నాయి. ఇలా దిగుమతి చేసుకున్న బంగారంతో జ్యుయెలర్లు నగలు తయారు చేసి ఎగుమతి చేస్తుంటారు. జెమ్స్ అండ్ జ్యుయెలరీ ఎగుమతులు కిందటి నెలలో ఏడాది లెక్కన 16 శాతం పెరిగి 3 బిలియన్ డాలర్లకు చేరుకోవడం విశేషం.
రూ.1,200 తగ్గిన బంగారం ధర
జీవిత కాల గరిష్టాలకు చేరిన గోల్డ్ ధరలు సోమవారం దిగొచ్చాయి. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాములు గోల్డ్ ధర రూ.1,200 పడి రూ.88,200 కి తగ్గింది. 99.9 శాతం ప్యూరిటీ గల 10 గ్రాములు బంగారం ధర శుక్రవారం రూ. 89,400 పలికింది. 99.5 శాతం ప్యూరిటీ గల గోల్డ్ రేటు శుక్రవారం రూ.89 వేలకు చేరుకోగా, సోమవారం రూ.1,200 తగ్గి రూ.87,800 కి దిగొచ్చింది. మరోవైపు వెండి కేజీ ధర రూ.1,800 తగ్గి రూ.98,200 కి తగ్గింది. హైదరాబాద్లో 10 గ్రాముల గోల్డ్ (99.9 శాతం ప్యూరిటీ) ధర రూ.550 పెరిగి రూ. 86,620 కి చేరుకోగా, కేజీ వెండి ధర రూ.1,08,000 పలుకుతోంది. ధరలు ఎక్కువగా ఉండడంతో గోల్డ్కు డిమాండ్ తగ్గుతోందని ఎనలిస్టులు చెబుతున్నారు.
కానీ, ఎంసీఎక్స్లో మాత్రం గోల్డ్ ఏప్రిల్ ఫ్యూచర్స్ ధర సోమవారం రూ.431 పెరిగి రూ.85,118 లెవెల్ను టచ్ చేసింది. సిల్వర్ ఫ్యూచర్స్ రేటు రూ.234 పెరిగి రూ.95,820 వద్ద ట్రేడవుతోంది. గ్లోబల్గా చూస్తే ఔన్స్ గోల్డ్ ధర 2,911.95 డాలర్లకు చేరుకుంది. యూఎస్ ట్రెజరీ ఈల్డ్స్ పడడంతో పాటు డాలర్ బలహీనపడడంతో గోల్డ్ సోమవారం లాభాల్లో ఓపెన్ అయ్యిందని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ కమొడిటీ ఎనలిస్ట్ సౌమిల్ గాంధీ అన్నారు. యూఎస్ ఎకనామిక్ డేటా అంచనాలను అందుకోకపోవడంతో డాలర్ ఇండెక్స్ రెండు నెలల కనిష్టం దగ్గర ట్రేడవుతోందని చెప్పారు. ట్రంప్ టారిఫ్ పాలసీలతో అనిశ్చితి నెలకొందని, ఫలితంగా గోల్డ్ కొనుగోళ్లు పెరుగుతున్నాయన్నారు.