
మంథని, వెలుగు: మంథని పట్టణంలోని ధనలక్ష్మి జువెలర్స్ షాపు యజమాని తమ బంగారంతో పరారయ్యాడని, తమ బంగారం ఇప్పించాలని పట్టణానికి చెందిన పలువురు బాధితులు ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా పలువురు బాధితులు మాట్లాడుతూ 30 ఏండ్లుగా మంథనిలో ధనలక్ష్మి జ్యువెల్లరీ షాపు పేరిట మహారాష్ట్రకు చెందిన తోరత్ సీతారాం నగల వ్యాపారం చేస్తున్నాడని, దీంతో మంథని, చుట్టుపక్కల గ్రామాలకు చెందిన చాలామంది నగల తయారీకి ఆర్డర్స్ ఇచ్చారన్నారు.
వ్యాపారి, అతని కొడుకులు ప్రవీణ్, ప్రశాంత్ పరారైనట్లు తెలిపారు. వారం రోజులైనా తిరిగి రాకపోవడం, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉండడంతో మోసపోయమని గ్రహించి ఆదివారం పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు పోలీసులు తెలిపారు. సుమారు 52 మంది బాధితులు నుంచి 78 గ్రాముల బంగారంతో పాటు ఒక కేజీ వెండి, రూ.52 లక్షల నగదు తీసుకొని పరారయినట్టు పోలీసులు తెలిపారు.