
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధరలు ఇవాళ (గురువారం) 600 రూపాయలు పెరగడంతో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 89 వేల 450 రూపాయలకు చేరింది. బంగారం ధరలు ఆల్ టైం హైకి చేరి మధ్యతరగతి వర్గం కొనలేనంత స్థాయికి పసిడి చేరుకుంది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర ఫిబ్రవరి 20న కూడా 89,450 రూపాయలు పలికింది. ఆ స్థాయి ధరను బంగారం ఇవాళ మళ్లీ చూసింది. వెండి ధరలు కూడా ఐదేళ్ల గరిష్టానికి చేరుకుంది. దేశ రాజధానిలో కిలో వెండి ధర లక్షా 12 వందల రూపాయలు పలికింది.
ఆర్థిక మాంద్యం పెరగటంతో పెట్టుబడిదారులు పసిడిని కొనడానికి ఆసక్తి చూపుతున్నారు. ఆ ప్రభావంతో బంగారం ధరలు పెరుగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ రూపాయి మారకం రేటుకు అనుగుణంగా దేశీయంగా బంగారం, వెండి ధరలు పెరగటం, తగ్గటం జరుగుతుంటాయి. అమెరికా వాణిజ్య విధానాలకు సంబంధించి ఆ దేశాధ్యక్షుడు ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు, సుంకాలు పెంచడం వంటి నిర్ణయాలు కూడా బంగారం ధరలు పెరగడానికి కారణమవుతున్నాయి.
Also Read : బ్యాంకులో మీ డబ్బు సేఫేనా..?
ఇన్ ఫ్లేషన్స్ పెరగడం, దేశీయంగా పెళ్లిళ్ల సీజన్, పండుగల కోసం గోల్డ్ కొనుగోళ్లకు డిమాండ్ పెరడం వంటి కారణాలతో ధరలు పెరుగుతూ వస్తున్నాయి. పెట్టుబడిదారుల నుంచి డిమాండ్ అధికమవటంతో.. అంతర్జాతీయ కమోడిటీస్ మార్కెట్లో వీటి ధరలు మరింత ఎగబాకాయని ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. పెరుగుతున్న క్రూడాయిల్, నిత్యావసర ధరలతో పాటు బంగారం ధరలు కూడా ప్రస్తుతం బాటలో ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో అనిశ్చిత పరిస్థితులు ఎప్పుడూ బంగారానికి డిమాండ్ పెంచేస్తుంటాయి.