
- రూ.96 వేలను దాటిన 10 గ్రాముల గోల్డ్ రేటు
- ముదురుతున్న వాణిజ్య యుద్ధంతో ఫుల్ డిమాండ్
- భవిష్యత్లో రేట్లు మరింత పెరిగే ఛాన్స్
- హైదరాబాద్లో ధర రూ.95 వేలు
న్యూఢిల్లీ: ట్రంప్ దెబ్బకు ఒకవైపు స్టాక్ మార్కెట్లు కుదేలవుతుండగా, మరోవైపు బంగారం ధరలు చుక్కలనంటుతున్నాయి. యూఎస్ ప్రభుత్వం గురువారం చైనాపై టారిఫ్ను 145 శాతానికి పెంచగా, ప్రతీకారంగా యూఎస్ ప్రొడక్ట్లపై టారిఫ్ను 125 శాతానికి చైనా పెంచింది. దీంతో ఇరు దేశాల మధ్య ట్రేడ్ వార్ ముదిరింది. ఇన్వెస్ట్మెంట్లకు సేఫ్ అయిన గోల్డ్ వైపు ఇన్వెస్టర్లు క్యూ కడుతున్నారు. డిమాండ్ పెరగడంతో 10 గ్రాముల బంగారం ధర (24 క్యారెట్లు) శుక్రవారం ఢిల్లీలో రూ. 6,250 పెరిగి రూ. 96,450 కి ఎగిసింది. హైదరాబాద్లో 10 గ్రాముల గోల్డ్ రూ.95,400 పలుకుతోంది. టారిఫ్ వార్ ముదురుతుండడంతో అంతర్జాతీయ మార్కెట్లలో బంగారానికి డిమాండ్ పెరుగుతోందని ఎనలిస్టులు తెలిపారు. 24 క్యారెట్ల బంగారం బుధవారం 10 గ్రాములకు రూ. 90,200 వద్ద ముగిసింది. మహవీర్ జయంతి సందర్భంగా గురువారం బులియన్ మార్కెట్ ఓపెన్ కాలేదు. వరుసగా నాలుగు రోజుల పాటు పడ్డ గోల్డ్ రేట్లు, శుక్రవారం భారీ ర్యాలీ చేశాయి. వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి. కేజీకి రూ. 2,300 పెరిగి రూ. 95,500కి చేరాయి. మరోవైపు ఎంసీఎక్స్ లో బంగారం ఫ్యూచర్స్ (జూన్ డెలివరీ) 10 గ్రాములకు రూ. 1,703 పెరిగి ఆల్-టైమ్ గరిష్ట స్థాయి రూ. 93,736 లెవెల్ను టచ్ చేశాయి.
ఎనలిస్టులు ఏమంటున్నారంటే?
"గోల్డ్ రికార్డ్ ర్యాలీ కొనసాగుతోంది. ఎంసీఎక్స్లో రూ. 93,500 వద్ద కొత్త ఆల్-టైమ్ హైని నమోదు చేసింది. రూపాయి బలంగా ఉన్నప్పటికీ, జియో పొలిటికల్ టెన్షన్లు ముదరడం, అమెరికా–చైనా మధ్య టారిఫ్ వార్ మరింత తీవ్రతరం కావడంతో గోల్డ్ ధరలు పెరుగుతున్నాయి" అని ఎల్కేపీ సెక్యూరిటీస్ వైస్ ప్రెసిడెంట్ జతిన్ త్రివేది అన్నారు. అంతర్జాతీయ మార్కెట్లలో స్పాట్ బంగారం కొత్త గరిష్ట స్థాయి అయిన ఔన్స్ (28.34 గ్రాములు) కు 3,237.39 (రూ.2.78 లక్షలకు) డాలర్లకు ఎగసింది. చివరికి 3,222.04 డాలర్ల వద్ద సెటిలయ్యింది. ఆసియా మార్కెట్ అయిన కామెక్స్లో బంగారం ఫ్యూచర్స్ రికార్డు గరిష్ట స్థాయి అయిన 3,249.16 డాలర్లకు చేరుకున్నాయి. కాగా, ఈ నెల 2న బంగారం ధరలు ఔన్సుకి 3,200 డాలర్లను తాకగా, లాభాల స్వీకరణతో వరుస సెషన్లలో పడ్డాయి. టారిఫ్ వార్ ముదరడం, యూఎస్ ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి జారుకుంటుందనే భయాలు పెరగడంతో యూఎస్ డాలర్ విలువ కూడా పడుతోంది. బంగారం ధరలు పెరగడానికి ఇదొక కారణం. ట్రేడ్ వార్ కొనసాగే అవకాశం ఉండడంతో దీర్ఘకాలంలో గోల్డ్ రేట్లు మరింత పెరుగుతాయని ఎనలిస్టులు చెబుతున్నారు. ఈ ఏడాది చివరిలోపు రూ.లక్ష మార్క్ను కూడా టచ్ చేస్తుందని అంచనా వేస్తున్నారు. వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకులు గోల్డ్ కొనుగోళ్లు పెంచడంతో కూడా బంగారం ధరలు పెరుగుతున్నాయి. ఇండియాలో పెళ్లిళ్ల సీజన్ మొదలవ్వడంతో బంగారు ఆభరణాల కొనుగోళ్లూ ఊపందుకున్నాయి. గోల్డ్ రేట్లు పెరగడానికి ఇది కూడా కారణం. మరోవైపు ధరలు ఎక్కువగా ఉండడంతో కొనుగోళ్లు కూడా కొంత మేర తగ్గాయని ఎనలిస్టులు చెబుతున్నారు.