
- వరంగల్ జిల్లా రాయపర్తిలో ఘటన
రాయపర్తి, వెలుగు: మార్కెట్ లో గోల్డ్ ధర రూ.87 వేల వరకు ఉండగా.. తమకు అంతకంటే తక్కువ ఇవ్వడం ఏంటని బ్యాంక్ అధికారులపై బాధితులు మండిపడ్డారు. ఎంతో కష్టపడి సంపాదించుకున్న సొమ్ము బ్యాంక్లో కుదవ పెడితే చివరకు తీవ్రంగా నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళ్తే.. వరంగల్జిల్లా రాయపర్తి మండల కేంద్రంలోని ఎస్బీఐలో గతేడాది నవంబర్లో గోల్డ్ చోరీ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనమైన విషయం తెలిసిందే.
బ్యాంకులో చొరబడిన దొంగలు రూ.13.61 కోట్ల విలువైన ఆభరణాలను ఎత్తుకెళ్లారు. పోలీసులు దర్యాప్తు చేపట్టి ఏడుగురిలో ఐదుగురిని అరెస్ట్ చేశారు. 19 కిలోల గోల్డ్ ఎత్తుకెళ్లగా 2 కిలోల 520 గ్రాముల మాత్రమే రికవరీ చేశారు. ఘటనపై అప్పట్లోనే బాధితులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
బ్యాంక్ అధికారులు గోల్డ్ ఎక్కడికి పోదని నచ్చజెపుతుండగా నెలలు గడుస్తుండగా చివరకు బాధితులకు నగదుగా ఇచ్చేందుకు.. 22 క్యారెట్ల గోల్డ్ పది గ్రాముల కు రూ.77,710 చొప్పున చెల్లించేందుకు నిర్ణయించారు. దీంతో బుధవారం బ్యాంక్ ముందు బాధితులు ఆందోళన చేపట్టారు. బ్యాంక్ మేనేజర్సత్యనారాయణ నచ్చచెప్పేందుకు ప్రయత్నించినా వినలేదు. కాగా రూల్స్ మేరకు డబ్బులు నిర్ణయించామని బ్యాంక్ అధికారులు తెలిపారు.