ఆల్టైమ్ రికార్డు..తులం బంగారం ధర రూ.89వేలు

ఆల్టైమ్ రికార్డు..తులం బంగారం ధర రూ.89వేలు
  • బంగారం@  రూ.89,000
  • రూ.లక్షకు చేరిన వెండి ధర

న్యూఢిల్లీ: పసిడి పరుగు ఆగడం లేదు. ఆభరణాల వ్యాపారులు,  రిటైలర్ల నుంచి భారీ కొనుగోళ్ల వల్ల బంగారం ధరలు శుక్రవారం రూ.1,300 పెరిగి ఆల్ టైమ్ గరిష్ట స్థాయి రూ.89,400కి చేరుకున్నాయని ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ తెలిపింది. 99.9 శాతం స్వచ్ఛత కలిగిన  విలువైన పుత్తడి గురువారం 10 గ్రాములకు రూ.88,100 పలికింది. 

అయితే 99.5 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం ధర రూ.1,300 పెరిగి 10 గ్రాములకు రూ.89 వేల తాజా గరిష్ట స్థాయికి చేరుకుంది.  మునుపటి ముగింపు ధర రూ.87,700. వెండి ధర కూడా కేజీకి రూ.2,000 పెరిగి నాలుగు నెలల గరిష్ట స్థాయి  రూ. లక్షకు చేరుకుంది. గురువారం ధర కేజీకి రూ.98 వేల దగ్గర ఉంది. ఎంసీఎక్స్​ ఫ్యూచర్స్ ట్రేడ్‌‌‌‌లో, ఏప్రిల్ డెలివరీకి సంబంధించిన బంగారం కాంట్రాక్టులు 10 గ్రాములకు రూ.184 పెరిగి రూ.85,993కి చేరుకున్నాయి. 

మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ లో కిలో వెండికి ఫ్యూచర్లు రూ.2,517 లేదా 2.64 శాతం పెరిగి రూ.97,750కి చేరుకున్నాయి.  బలహీనమైన డాలర్ ఇండెక్స్, యూఎస్​ టారిఫ్ పాలసీల మద్దతు కారణంగా బంగారం ధరల ఊపు కొనసాగిందని ఎల్​కేపీ సెక్యూరిటీస్‌‌‌‌లో కమోడిటీ,  కరెన్సీ రీసెర్చ్ అనలిస్ట్ జతీన్ త్రివేది అన్నారు.