Good news: జూలై 18 నుంచి ఆగస్టు 5 వరకు డీఎస్సీ పరీక్షలు

Good news: జూలై 18 నుంచి ఆగస్టు 5 వరకు డీఎస్సీ పరీక్షలు

తెలంగాణ డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. డీఎస్సీ పరీక్షలను యధావిధిగా నిర్వహించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. జూలై 18 నుంచి ఆగస్టు 5 వరకు డీఎస్సీ పరీక్షలు నిర్వహించనున్నారు. జూలై 11 నుంచి విద్యాశాఖ వెబ్ సైట్ లో హాల్ టికెట్లు అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు. 

సబ్జెక్టులు, పోస్టుల వారీగా పరీక్షలు నిర్వహించనున్నారు. పూర్తిస్థాయి షెడ్యూల్ ను పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. గత ఫిబ్రవరిలో నోటిఫికేషన్ విడుదల కాగా.. జూలై 17 నుంచి 31 వరకు పరీక్షలు ఉంటాయని విద్యాశాఖ ప్రకటించగా.. ఆ తేదీలను మార్పులు చేశారు. మొత్తం 13 రోజులు పరీక్షలు జరుగుతాయి. 

జూలై 18 న స్కూల్ అసిస్టెంట్  సాంఘిక శాస్త్రం, భౌతిక శాస్త్రం, పీఈటీతో పరీక్షలు మొదలవుతాయి. ఆగస్టు 5న లాంగ్వేజ్ పండిట్ హిందీతో పరీక్షలు ముగుస్తాయి. ఆన్ లైన్ పరీక్షలు కావడంతో ఉదయం, మధ్యాహ్నం నిర్వహిస్తారు. మొత్తం 11,062 ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి రాష్ట్రవ్యాప్తంగా 2.79 లక్షల మంది దరఖాస్తులు చేసుకున్నారు. అయితే డీఎస్సీ పరీక్షలు పోస్ట్ పోన్ చేయాలని గత కొద్ది రోజులుగా అభ్యర్థులు నిరసన తెలుపుతున్నారు .