
పెనుబల్లి, వెలుగు : ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం పార్థసారథిపురం రైల్వేస్టేషన్సమీపంలో ఆదివారం గూడ్స్ రైలు ఢీ కొని 20 గొర్రెలు చనిపోయాయి. పార్థసారథిపురం గ్రామానికి చెందిన జోగు నాగేశ్వరరావు అనే రైతుకు చెందిన గొర్రెల మందను శనివారం రాత్రి తన పెరట్లో ఉంచాడు.
ఆదివారం తెల్లవారుజామున మందలోని 20 గొర్రెలు తప్పించుకుని దగ్గరలోని రైల్వే స్టేషన్ నుంచి లోపలికి వెళ్లి అక్కడ నుంచి రైల్వే ట్రాక్ మీద కొంత దూరం వెళ్లి అక్కడే పడుకున్నాయి. అదే సమయంలో బొగ్గు లోడ్తో సత్తుపల్లి నుంచి కొత్తగూడెం వెళ్తున్న గూడ్స్ రైలు గొర్రెలను ఢీకొడుతూ వెళ్లింది. దీంతో 20 గొర్రెలు చనిపోయాయి. గొర్రెలు చనిపోవడం వల్ల తనకు రూ. 2 లక్షల వరకు నష్టం జరిగిందని, ఆదుకోవాలని రైతు విజ్ఞప్తి చేశాడు.