
- ఎమ్మెల్యే చొరవతో బల్దియాలో -రూ.100కోట్లతో పనులు
- రోడ్ల విస్తరణపై ప్రత్యేక దృష్టి
- 25 ఏళ్ల తర్వాత అక్రమ నిర్మాణాల కూల్చివేత
- డ్రైనేజీలు, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటుకు చర్యలు
గోదావరిఖని, వెలుగు : రామగుండం అభివృద్ధిపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. బల్దియా పాలకవర్గంతోపాటు ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ఠాకూర్ టౌన్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టిపెట్టారు. సిటీలో రూ.100కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ముఖ్యంగా టౌన్లో రోడ్ల విస్తరణపై దృష్టి సారించారు. దీనిలో భాగంగా అడ్డుగా ఉన్న సింగరేణి క్వార్టర్లతో పాటు ఇతర నిర్మాణాలను తొలగిస్తున్నారు. 25 ఏళ్ల తర్వాత నిర్మాణాలు తొలగిస్తుండడంపై ప్రజలు హర్షిస్తున్నారు.
మార్కెట్ ఏరియాలో ట్రాఫిక్ చిక్కులు
గోదావరిఖని పట్టణానికి లక్ష్మీనగర్, కల్యాణ్నగర్ వ్యాపార కేంద్రాలు. హాస్పిటల్స్తోపాటు బిజినెస్ అంతా ఇక్కడే జరుగుతుంది. ఈ ఏరియాలో రోడ్లన్నీ బిజీగా ఉంటాయి. ఇక్కడి వచ్చేదారులన్నీ ఇరుగ్గా మారి, ట్రాఫిక్ చిక్కులు తప్పడం లేదు. కొనుగోళ్లు, హాస్పిటల్స్ కు వచ్చేవారికి వాహనాల పార్కింగ్కు జాగా దొరకని పరిస్థితి. ముఖ్యంగా ఎమర్జెన్సీ సర్వీసులైన అంబులెన్స్లు, ఫైరింజన్లు వెళ్లాలన్నా దారి ఉండదు.
చిరువ్యాపారులు రోడ్లను ఆక్రమించుకుని వ్యాపారాలు చేస్తున్నారు. కాగా మార్కెట్ ఏరియా ప్రక్షాళనకు ఎమ్మెల్యే సిద్ధమయ్యారు. ఇందుకోసం టీయూఎస్ఐడీసీ స్కీమ్ కింద రూ.100 కోట్ల నిధులు రాగా అందులో రూ.50 కోట్లను కేవలం లక్ష్మీనగర్ మార్కెట్ఏరియా అభివృద్ధి కోసమే ఖర్చు చేయడానికి నిర్ణయించారు.
అడ్డుగా ఉన్న నిర్మాణాల కూల్చివేతలు
గోదావరిఖనిలో రోడ్ల విస్తరణ, సర్వీస్ రోడ్ల పునరుద్ధరణపై దృష్టి సారించి రామగుండం కార్పొరేషన్ ఆధ్వర్యంలో అక్రమ నిర్మాణాలను తొలగించే పని మొదలుపెట్టారు. రామగుండం నుంచి గోదావరిఖనిలోకి ఎంటర్ అయ్యే దారిలో ఎన్టీపీసీ మేడిపల్లి సెంటర్ వద్ద అడ్డుగా చేపట్టిన నిర్మాణాలను ఇటీవల తొలగించారు. బల్దియా కమిషనర్ సీహెచ్ శ్రీకాంత్, రెవెన్యూ అధికారులు పోలీసుల సహకారంతో నిర్మాణాలను తొలగించి సర్వీస్ రోడ్లను పునరుద్ధరించారు. ఇక గోదావరిఖనిలో కూడా రోడ్ల విస్తరణ కోసం న్యూ అశోక్ థియేటర్ నుంచి రీగల్ షూమార్టు వరకు
అశోక్నగర్ నుంచి ఐడీఎస్ఎంటీ షాపింగ్ కాంప్లెక్స్వరకున్న 72 రెండు వరుసల సింగరేణి క్వార్టర్స్, వాటికి అనుకుని నిర్మించిన షెడ్లను తొలగించడానికి అందులో నివాసముంటున్న కార్మికులకు ఇప్పటికే మేనేజ్మెంట్ నోటీసులు జారీ చేసింది. దీంతోపాటు సింగరేణి నుంచి లీజ్పద్ధతిలో ల్యాండ్ తీసుకుని నిర్మించిన ఓల్డ్ అశోక థియేటర్ శిథిలావస్థకు చేరింది.
ఈ టాకీస్ వల్ల మార్కెట్ ఏరియాలోకి వచ్చేందుకు రోడ్డు ఇరుగ్గా ఉండడంతో రెండు రోజుల కింద దానిని కూల్చివేశారు. క్వార్టర్స్ కూల్చివేత తర్వాత రోడ్ల విస్తరణ, ఆధునిక సెంట్రల్ లైటింగ్ సిస్టం, వరద నీటి కోసం ఓపెన్ డ్రైనేజీ సిస్టమ్ వంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నారు.
25 ఏళ్లుగా మాస్టర్ ప్లాన్అమలుచేయలే..
రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో రోడ్లకు ఇరువైపులా ఇబ్బడిముబ్బడిగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను బల్దియా సిబ్బంది ఇప్పటికే తొలగించారు. రామగుండం బీ పవర్హౌస్ గడ్డ నుంచి ఫైవింక్లయిన్ చౌరస్తా వరకున్న హోర్డింగ్లను తీసేశారు. 1998లో మొదటిసారిగా రామగుండం మున్సిపాలిటీ ఎన్నికలు జరగగా..
అప్పటి పాలకవర్గం రోడ్ల విస్తరణకు అడ్డుగా ఉన్న అక్రమ నిర్మాణాలను తొలగించింది. ఆ తర్వాత రామగుండంలో ఎలాంటి మాస్టర్ ప్లాన్ అమలు చేయలేదు. 25 ఏళ్ల తర్వాత సిటీ డెవలప్మెంట్ కోసం రోడ్డుకు అడ్డుగా ఉన్న నిర్మాణాలు తొలగిస్తున్నారు.
బల్దియా అభివృద్ధికి ప్రజలు సహకరించాలి
రామగుండం, గోదావరిఖని అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాం. ఇందులో భాగంగా బల్దియాలో రోడ్ల విస్తరణకు చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికీ 72 సింగరేణి క్వార్టర్స్లో ఉన్న వారు ఖాళీ చేయాలని మేనేజ్మెంట్ నోటీసులు ఇచ్చింది. రోడ్ల విస్తరణలో నష్టపోయేవారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తాం. సిటీ అభివృద్ధికి అన్ని వర్గాల ప్రజలు సహకరించాలి.
ఎంఎస్ రాజ్ఠాకూర్, రామగుండం ఎమ్మెల్యే