తెలంగాణ నుండి వెళ్లిన ఐఏఎస్‎లకు పోస్టింగ్స్.. ఆమ్రపాలికి ఏం పదవి ఇచ్చారంటే..?

తెలంగాణ నుండి వెళ్లిన ఐఏఎస్‎లకు పోస్టింగ్స్.. ఆమ్రపాలికి ఏం పదవి ఇచ్చారంటే..?

తెలంగాణ నుండి రిలీవ్ అయ్యి ఏపీకి వెళ్లిన పలువురు ఐఏఎస్‎లకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోస్టింగ్స్ ఇచ్చింది. తెలంగాణలో జీహెచ్ఎంసీ కమిషనర్‎గా కీలక బాధ్యతలు నిర్వర్తించిన ఐఏఎస్ అధికారిణి కాట ఆమ్రపాలిని టూరిజం ఎండీ, టూరిజం అథారిటీ సీఈవోగా ఏపీ ప్రభుత్వం నియమించింది. మరో సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ వాకాటి కరుణను వైద్యారోగ్య శాఖ కమిషనర్‎గా అపాయింట్ చేసింది. జీఏడీ ముఖ్య కార్యదర్శిగా వాణీ మోహన్, కార్మిక శాఖ ముఖ్య కార్యదర్శిగా వాణీ ప్రసాద్ను నియమించింది. ఈ మేరకు 2024, అక్టోబర్ 27న ఏపీ సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. 

కాగా, డీవోపీటీ ఆదేశాల మేరకు తెలంగాణ నుండి పలువురు ఐఏఎస్‎లు ఆంధ్రప్రదేశ్‎కు వెళ్లిన విషయం తెలిసిందే. ఆమ్రపాలి, రోనాల్డ్ రోస్, ప్రశాంతి, వాణీప్రసాద్ 2024, అక్టోబర్ 16వ తేదీన ఏపీ ప్రభుత్వానికి రిపోర్ట్ చేశారు. ఇందులో ఐఏఎస్ ప్రశాంతికి ఈ నెల 20వ తేదీనే ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. ప్రశాంతికి అటవీ, పర్యావరణ శాఖ అదనపు కార్యదర్శి బాధ్యతలను అప్పగించింది. తాజాగా ఇవాళ మరికొందరికి పదవులు ఇచ్చింది. రోనాల్డ్ రోస్‎కు మాత్రం ఏపీ సర్కార్ ఇంకా పోస్టింగ్ ఇవ్వలేదు. 

Also Read :- మాలల జనాభాపై అవాస్తవాలు మాట్లాడుతున్నారు

కాగా, తెలంగాణలో పని చేస్తోన్న ఏపీ కేడర్ ఐఏఎస్‎లను తిరిగి ఆంధ్రప్రదేశ్‎కు వెళ్లాలని డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్ (డీవోపీటీ) ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. దీంతో తెలంగాణలో పని చేస్తోన్న నలుగురు ఏపీ కేడర్ ఐఏఎస్ అధికారులు ఆమ్రపాలి, ప్రశాంతి, రోనాల్డ్ రోస్, వాణీ ప్రసాద్ డీవోపీటీ ఆదేశాలను సవాల్ చేస్తూ క్యాట్‎ను ఆశ్రయించారు. డీవోపీటీ ఆదేశాలపై స్టే విధించాలని కోరారు. కానీ క్యాట్‎లో వారికి వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. 

క్యాట్‎లో అనుకూల ఫలితం రాకపోవడంతో తెలంగాణ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. తెలంగాణ హైకోర్టులోనూ ఐఏఎస్ అధికారులకు వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. డీవోపీటీ ఆదేశాల మేరకు ఏపీకి వెళ్లి రిపోర్ట్ చేయాలని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. చేసేదేమి లేక ఐఏఎస్‎ అధికారులు ఆంధ్రప్రదేశ్‎లో రిపోర్ట్ చేశారు. ఈ క్రమంలోనే ఏపీలో రిపోర్ట్ చేసిన అధికారులకు అక్కడి ప్రభుత్వం పోస్టింగ్స్ ఇచ్చింది.