నిజామాబాద్ జిల్లాలో కొత్త సార్లొచ్చిన్రు

నిజామాబాద్ జిల్లాలో  కొత్త సార్లొచ్చిన్రు
  • కామారెడ్డి జిల్లాలో 440 మందికి పోస్టింగులు
  • కౌన్సెలింగ్​ ద్వారా పోస్టింగులు
  • నేటి నుంచి బాధ్యతలు స్వీకరణ

కామారెడ్డి, వెలుగు:  ఇటీవల నిర్వహించిన డీఎస్సీలో సెలక్టు అయిన టీచర్లకు ప్రభుత్వం పోస్టింగ్​లు ఇచ్చింది.  మంగళవారం జిల్లాల్లో కౌన్సెలింగ్​ నిర్వహించారు.  పోస్టింగ్​లు పొందిన టీచర్లు బుధవారం బాధ్యతలు స్వీకరించనున్నారు.   కామారెడ్డి జిల్లాలో  440 మందికి పోస్టింగ్​లు ఇచ్చారు. 

 జిల్లాలో 506 పోస్టుల భర్తీ కి డీఎస్సీ నిర్వహించారు.   62 పోస్టులు బ్యాక్​లాగ్​గా మిగిలాయి    కొందరు రెండు  సబ్జెక్టులకు సెలక్టు కావటం, కొన్ని పోస్టులకు సరిపడా అభ్యర్థులు లేని కారణంగా బ్యాక్​లాగ్ ​పోస్టులు మిగిలాయి.  మంగళవారం కలెక్టరేట్లో  కొత్తగా సెలక్టు అయిన టీచర్లకు కౌన్సిలింగ్​ నిర్వహించారు.  ఎస్జీటీ 256 పోస్టులు,  స్కూల్​ అసిస్టెంట్లు 184 పోస్టులు భర్తీ చేశారు.   అడిషనల్ కలెక్టర్​ శ్రీనివాస్​రెడ్డి, డీఈవో రాజు కౌన్సిలింగ్​ను పర్యవేక్షించారు.

ఉర్దూ మీడియం టీచర్ గా

ఆమె తెలుగమ్మాయి.   ఉర్దూ మీడియంలో చదవి  స్కూల్​ అసిస్టెంట్​గా  ఉద్యోగం సాధించింది.   కామారెడ్డి జిల్లా జుక్కల్​ మండలం కేంరాజ్​కల్లాలికి చెందిన పొనగంటి జయశ్రీ 1 నుంచి 4 వరకు స్థానికంగా చదువుకుంది.  5 నుంచి 10  వరకు బాన్సువాడ ఎస్సీ హాస్టల్​లో  ఉంటూ ఉర్దూ మీడియంలో చదివి,  ఆ తర్వాత ఇంటర్​, డిగ్రీ, బీఈడీ పూర్తి చేసింది.  జయశ్రీ చదువులో చూపుతున్న ప్రతిభను గమనించి వార్డెన్​ సుజన ప్రియ ప్రొత్సహించారు.  ఈమెకు బిచ్​కుంద మండలం లో  స్కూల్ అసిస్టెంట్ ఉర్దూ మీడియం టీచర్​గా పోస్టింగ్​ పొందారు.    – పొనగంటి జయశ్రీ​ , జుక్కల్​ మండలం

స్కూల్​ అసిస్టెంట్​కు సెలక్ట్​అయ్యా

నాది రామారెడ్డి మండలం జగదాంబతండా.  నేను ప్రస్తుతం ఎస్జీటీ టీచర్​గా పని చేస్తున్నా.    నాకు స్కూల్​ అసిస్టెంట్​ టీచర్​ కావాలని ఉండేది.  ఇటీవల డీఎస్సీ నోటిఫికేషన్​ రాగానే   నెలన్నర పాటు శ్రద్ధగా చదివా. స్కూల్​ అసిస్టెంట్ మ్యాథ్స్​కు సెలక్టు అయ్యా.   నాగిరెడ్డిపేట మండలం బొల్లారం హైస్కూల్​లో పోస్టింగ్​ ఇచ్చారు.
 ‌‌ సలావత్​ చందర్,  రామారెడ్డి మండల

డెలివరీకి ఉన్నా..చదవటం అపలే

గర్భిణిగా ఉన్నప్పుడు డీఎస్సీ నోటిఫికేషన్​ వచ్చింది.   నా లక్ష్యం నేరవేర్చుకునేందుకు  పట్టువదలకుండా చదివా.  ఫస్ట్ రెసిడెన్సియల్​  స్కూల్​లో  పీజీటీ టీచర్​ జాబ్​ వచ్చింది. అయినా డీఎస్సీకి ఫ్రిఫేర్​ అయ్యా.  రోజుకు  6 నుంచి 8 గంటలు చదివా.   డెలివరీ తేదీ దగ్గరగా ఉన్నప్పుడే డీఎస్పీ ఎగ్జామ్​ రాశా.  కుటుంబ సభ్యులు బాగా సహకరించారు.  స్కూల్​ అసిస్టెంట్​ ఇంగ్లీష్​ టీచర్​గా సెలక్టు అయ్యా.  మా  ఇద్దరు అక్కల్లో ఒకరు టీచర్, మరకొరు డిప్యూటీ తహసీల్దార్​గా పని చేస్తున్నారు. -  దామెర శ్రీలత, కొత్తబాది, బాన్సువాడ మండలం