
- జనగామ జిల్లాలో 200 సెంటర్ల ఏర్పాటుకు కసరత్తు
- 2.30 లక్షల టన్నుల వడ్లు కొనేలా ప్లాన్
జనగామ, వెలుగు : యాసంగి వడ్ల కొనుగోళ్లకు జనగామ జిల్లా ఆఫీసర్లు రెడీ అవుతున్నారు. గత సీజన్ మాదిరిగానే ఈ సారి కూడా 200 సెంటర్లను ఓపెన్ చేసి మొత్తం 2.30 లక్షల వడ్లు కొనేలా ఏర్పాట్లు చేస్తున్నారు. వచ్చే నెల మొదటి లేదా రెండో వారంలో సెంటర్లను ప్రారంభించేందుకు సమాయత్తం అవుతున్నారు.
టార్గెట్ 2.30 లక్షల టన్నులు
జనగామ జిల్లాలో గతంలో ఎన్నడూ లేనంతగా ఈ సీజన్లో 1.89 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. దీంతో ఈ సారి రికార్డు స్థాయిలో వడ్ల దిగుబడి వస్తుందని ఆఫీసర్లు అంచనా వేశారు. ఈ సీజన్లో మొత్తం 2.30 లక్షల టన్నుల వడ్లు కొనాలని ఆఫీసర్లు టార్గెట్ పెట్టుకున్నారు. అయితే జనవరి 25 లోపు నాట్లు వేసిన పంటకు తెగుళ్లు సోకాయి. దీనికి తోడు దేవాదుల నీరు రాకపోవడంతో భూగర్భజలాలు అడుగంటాయి. ఇటీవల కురిసిన వర్షాలకు జిల్లాలోని 12 మండలాల పరిధిలో 4,338 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. దీంతో అనుకున్నంత దిగుబడి వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. గత యాసంగి సీజన్లో 1,56,179 టన్నుల వడ్లు కొనగా, ఈ సారి ఆ మార్క్ను చేరుకోవడం కూడా కష్టమే అని తెలుస్తోంది.
గన్నీల ప్రాబ్లం రాకుండా...
ప్రతీ సీజన్లో కొనుగోలు కేంద్రాల్లో గన్నీ బ్యాగుల కొరత వేధిస్తోంది. ఈ సారి అలాంటి ఇబ్బంది తలెత్తకుండా ఆఫీసర్లు చర్యలు తీసుకుంటున్నారు. జనగామ జిల్లాకు మొత్తం 57 లక్షల గన్నీబ్యాగుల అవసరం ఉండగా ప్రస్తుతం 30.25 లక్షల బ్యాగులు అందుబాటులో ఉన్నాయి. మిగిలిన వాటిని తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. గతంలో ఇచ్చిన గన్నీ బ్యాగులకు రంధ్రాలు పడడంతో అటు రైతులు, ఇటు సెంటర్ల నిర్వాహకులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. లోడ్ పంపించాక తూకంలో తేడాలంటూ మిల్లర్లు వడ్లు దింపుకోకుండా సతాయించారు. చివరికి ధాన్యంలో కోతలు విధించారు. ఈ సీజన్లో అలాంటి ఇబ్బందులు తలెత్తకుండా గన్నీబ్యాగుల అందుబాటులో ఉంచాలని రైతులు కోరుతున్నారు.
వచ్చే నెల మొదటి వారంలో ఓపెన్
పంట కోతలు వచ్చే నెల మొదటి వారంలో ప్రారంభం కానున్నాయి. దీంతో కొనుగోలు కేంద్రాలను మొదటి వారంలో గానీ, రెండో వారంలో గానీ ఓపెన్ చేసేందుకు ఆఫీసర్లు రెడీ అవుతున్నారు. సెంటర్లు ప్రారంభం అయిన రోజు నుంచే కాంటాలు స్టార్ట్ అయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
ఏర్పాట్లు పూర్తి చేయాలి
యాసంగి వడ్ల కొనుగోళ్లకు ఆఫీసర్లు రెడీగా ఉండాలని జనగామ అడిషనల్ కలెక్టర్ ప్రపుల్ దేశాయ్ ఆదేశించారు. వడ్ల కొనుగోళ్లపై శుక్రవారం కలెక్టరేట్లో రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 200 సెంటర్లు ఓపెన్ చేస్తామని చెప్పారు. ఇందులో ఐకేపీ ఆధ్వర్యంలో 111, పీఏసీ ఎస్ ఆధ్వర్యంలో 89 సెంటర్లు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. సెంటర్లలో వేయింగ్ మిషన్లు, టార్పాలి న్స్, గన్నీస్, మాయిశ్చర్ మీటర్స్, ప్యాడీ క్లీనర్స్తో పాటు మౌలిక వసతులు కల్పించాలని సూచించారు. వ్యవసాయ శాఖ అంచనా మేరకు 2.30 లక్షల టన్నుల వడ్ల దిగుబడి రానున్నట్లు చెప్పారు. సమావే శంలో డీఆర్డీవో రాంరెడ్డి, డీసీవో కిరణ్ కుమార్, డీసీఎస్వో ఎం.రోజారాణి, సివిల్ సప్లై డీఎం సంధ్యారాణి, మార్కె టింగ్ డీఎం నాగేశ్వరశర్మ పాల్గొన్నారు.