వరంగల్సిటీ, వెలుగు : ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేసే మందులను ఓ ఉద్యోగి ప్రైవేటుగా విక్రయిస్తూ పట్టుబడ్డాడు. గురువారం పోలీసులు, డ్రగ్ కంట్రోల్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రేటర్ వరంగల్ కాశీబుగ్గకు చెందిన నాగేందర్ కొన్ని ఏండ్లుగా ప్రాంతీయ కంటి ఆస్పత్రిలో ఫార్మసిస్టుగా విధులు నిర్వహిస్తున్నాడు.
రోగులకు అవసరమైన మందులను కావాల్సిన వాటికి మించి తెప్పిస్తూ, కొన్ని రోగులకు అందించి, మిగతావి కాశీబుగ్గలోని తన ఇంట్లో భద్రపర్చేవాడు. ఇలా పోగేసిన మందుల స్టాక్ను ప్రైవేటుకు అమ్మి సొమ్ము చేసుకునేవాడు. బుధవారం పక్కా సమాచారం మేరకు ఉమ్మడి వరంగల్ జిల్లాకి చెందిన డ్రగ్ కంట్రోల్ ఆఫీసర్స్, వరంగల్ టాస్క్ఫోర్స్, ఇంతెజార్గంజ్ పోలీసులు కాశీబుగ్గలోని నాగేందర్ ఇంటిపై రైడ్ చేసి రూ.80 వేల విలువైన మందులను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. నాగేందర్తోపాటు మరో వ్యక్తి బలరాం దాసులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. వారివెంట డ్రగ్ ఇన్స్పెక్టర్ అరవింద్, ఇంతేజార్గంజ్ పోలీసులు తదితరులు ఉన్నారు.