
- అన్ని ప్రభుత్వ విభాగాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం
- గూగుల్, మైక్రోసాఫ్ట్ సంస్థల సహకారం తీసుకోవాలనిసర్కారు నిర్ణయం
- ఎక్కడెక్కడ వినియోగించాలనే దానిపై నివేదిక కోరిన సీఎస్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ప్రభుత్వ పాలన, ప్రజాసేవల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ( ఏఐ)ను వినియోగించాలని ప్రభుత్వం భావిస్తున్నది. భవిష్యత్తు ఏఐదే కావడంతో ఆ దిశగా అడుగులు వేస్తున్నది. గూగుల్, మైక్రోసాఫ్ట్లాంటి వివిధ దిగ్గజ ఐటీ కంపెనీలతో ఏఐకి సంబంధించి ఒప్పందాలు చేసుకోవాలని నిర్ణయించింది. టెక్నాలజీలో ప్రభుత్వ శాఖలు వెనుకంజలో ఉండకుండా ముందస్తు ప్రయత్నాలు ప్రారంభించింది.
ప్రైవేట్కు చెందిన ఏఐ యాప్లు, ఇతర టూల్స్ ప్రభుత్వ కంప్యూటర్లలో వాడకుండా.. ప్రభుత్వ భాగస్వామ్యంతో రూపొందించిన వాటినే వినియోగించేలా ప్లాన్ చేస్తున్నది. తొలుత కొన్ని శాఖల్లో పైలెట్ ప్రాజెక్ట్ కింద వినియోగించి.. తర్వాత ఆయా శాఖల్లో ఉన్న అవసరాలకు తగ్గట్టుగా అమలు చేయాలని చూస్తున్నది. ఇందుకోసం ఉద్యోగులకు సైతం శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఇప్పటికే ఏఐ వినియోగం కోసం నోడల్ ఆఫీసర్లను నియమించింది. ఏయే ప్రభుత్వ శాఖలకు ఏ తరహా యాప్లు అవసరమనే దానిపై సీఎస్ రిపోర్ట్ కోరినట్లు తెలిసింది. సెక్రటేరియేట్తో పాటు ఆయా విభాగాల్లో జిల్లా, మండల స్థాయి వరకు ఏఐ టెక్నాలజీని వాడుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నది.
హెల్త్, ఎడ్యుకేషన్, అగ్రికల్చర్ టాప్ ప్రయారిటీ
హెల్త్, ఎడ్యుకేషన్, అగ్రికల్చర్, ట్రాన్స్పోర్ట్, ఫారెస్ట్, పోలీసు శాఖల్లో ఆర్టిఫిషియల్ ఇంటిలెజెన్స్ విస్తృతంగా వినియోగించుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నది. హెల్త్కు సంబంధించి ఆరోగ్య శ్రీ, హెల్త్ కార్డులు వంటివి ప్రభుత్వం అందిస్తున్నది. ఇందులో ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటల్స్ అన్నీ ఉన్నాయి. ఏఐను ప్రధానంగా రోగ నిర్ధారణ, ఆరోగ్య శ్రీ కింద చేస్తున్న సర్జరీల రిఫరెన్స్ల్లో వినియోగించాలని అనుకుంటున్నది.
ఇక ఇతర టెస్ట్లకు వాడుకోవాలని, ఏఐ- ఆధారిత ఇమేజ్ ప్రాసెసింగ్ తో క్యాన్సర్ వంటి రోగాలను ముందుగానే గుర్తించేలా అవకాశం ఉంటుందని భావిస్తున్నది. ఎడ్యుకేషన్లో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో టీచింగ్ కోసం ఏఐను అందుబాటులోకి తీసుకురాబోతున్నది. భవిష్యత్తులో ప్రశ్నపత్రాల రూపకల్పన, సిలబస్, ఆన్లైన్ ఎన్రోల్మెంట్ వంటివన్నీ ఏఐతో అనుసంధానం చేయాలని చూస్తున్నది. వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఉన్నత పాఠశాలల్లో ఏఐ పాఠాలతోపాటు విద్యార్థులకు ప్రత్యేక శిక్షణనిచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు.
ఈ రంగంపై ఆసక్తిని పెంచేందుకు పాఠశాలల్లో ఏఐ టూల్స్, సాఫ్ట్వేర్పైనా ప్రాథమిక శిక్షణ ఇవ్వనున్నారు. పోలీసు శాఖలో నేర నివారణ, నేరగాళ్లను గుర్తించడం, ట్రాఫిక్ నియంత్రణ, కేసుల సత్వర పరిష్కారం వంటి వాటికోసం ఏఐని వినియోగించాలని భావిస్తున్నది. ఇప్పటికే తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ‘ది మిత్ర’పేరిట ఏఐ ఆధారిత యాప్ను రూపొందించింది. పౌర సేవల కోసం టీ -యాప్, ట్రాఫిక్ - రియల్ టైం డేటాతో ట్రాఫిక్ నిర్వహణ, వ్యవసాయంలోనూ భూసార పరీక్షల ఆధారంగా వేయదగ్గ పంటలు, వాతావరణం ఆప్డేట్స్ , కొత్త వంగడాలు, దిగుబడులు, పంట తెగుళ్ల నివారణకు ఏఐ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తున్నది.