
- యూనివర్సల్ పెన్షన్ స్కీమ్తో అందరికీ పింఛను
- త్వరలో అందుబాటులోకి తీసుకురానున్న కేంద్రం
- ప్రతి నెలా కొంత మొత్తం చెల్లించాలి
- ఇప్పటికే ఉన్న పెన్షన్ స్కీమ్లను ఇందులో కలిపే ఆలోచన
న్యూఢిల్లీ:కన్స్ట్రక్షన్ వర్కర్లు వంటి అనార్గనైజ్డ్ సెక్టార్లలో పనిచేసే వారు కూడా పెన్షన్ (పింఛను) పొందేలా కేంద్రం కొత్త స్కీమ్ను రెడీ చేస్తోంది. దేశంలోని ప్రజలందరూ ఈ స్కీమ్కు అర్హులేనని అధికారులు చెబుతున్నారు. కోట్ల మందికి సాయపడుతుందని అన్నారు. ‘ఇది వాలంటరీ స్కీమ్. ఉద్యోగంతో సంబంధం లేదు. ప్రజలందరూ స్కీమ్ కింద ఇన్వెస్ట్ చేసి, రిటైర్మెంట్ ఏజ్లో పెన్షన్ పొందొచ్చు’ అని లేబర్ మినిస్ట్రీకి చెందిన అధికారులు వివరించారు.
యూనివర్సల్ పెన్షన్ స్కీమ్పై ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) పనిచేస్తోందని, ప్రాథమిక దశ పూర్తయ్యిందని వివరించారు. ఒకసారి స్కీమ్ డిజైన్ పూర్తయితే, స్టేక్హోల్డర్ల ఫీడ్బ్యాక్ను ప్రభుత్వం తీసుకుంటుంది. ప్రస్తుతం నేషనల్ పెన్షన్ స్కీమ్ (ఎన్పీఎస్), ప్రధాన్ మంత్రి శ్రమ్ యోగి మాన్ధన్ (పీఎం–ఎస్వైఎం), అటల్ పెన్షన్ యోజన వంటి వివిధ పెన్షన్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి.
వీటిని పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ (పీఎఫ్ఆర్డీఏ) నిర్వహిస్తోంది. ఈ స్కీమ్లు ఒక్కో వర్గం కోసం తీసుకొచ్చారు. అదే యూనివర్సల్ పెన్షన్ స్కీమ్ అందరికి అందుబాటులో ఉంటుందని అధికారులు చెబుతున్నారు. కేంద్రం తీసుకొచ్చే ‘యూనివర్సల్ పెన్షన్ స్కీమ్’ కింద పెన్షన్ పొందాలంటే నెల నెల కొంత మొత్తాన్ని ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వం ఎటువంటి కంట్రిబ్యూషన్ చేయదు’ అని వివరించారు.
ఇప్పటికే ఉన్న పెన్షన్ స్కీమ్లను కూడా ఇందులో కలిపే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ప్రస్తుతం ఎన్పీఎస్, పీఎం–ఎస్వైఎం కింద ఇన్వెస్ట్ చేస్తే రిటైర్మెంట్ ఏజ్ తర్వాత నెలకు రూ.3,000 పెన్షన్ పొందొచ్చు. పెన్షనర్ ఏజ్ బట్టి నెలకు చెల్లించే కంట్రిబ్యూషన్ రూ.55–200 మధ్య ఉంటోంది. ప్రభుత్వం కూడా అంతే మొత్తంలో కంట్రిబ్యూట్ చేస్తోంది.
రాష్ట్ర ప్రభుత్వాల పెన్షన్ స్కీమ్లు కలిపి..
రాష్ట్ర ప్రభుత్వాలు తమ పెన్షన్ స్కీమ్స్ను యూనివర్సల్ పెన్షన్ స్కీమ్లో కలపాలని కేంద్రం కోరొచ్చు. ఇలా చేయడం ద్వారా ఇచ్చే పెన్షన్ అమౌంట్ పెరుగుతుందని, అర్హులు ఒకటి కంటే ఎక్కువ స్కీమ్ల కింద పెన్షన్ తీసుకోకుండా నిరోధించొచ్చని అధికారులు చెబుతున్నారు. అంతేకాకుండా బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ (బీఓసీడబ్ల్యూ) చట్టం కింద సేకరిస్తున్న సెస్ను పెన్షన్ ఫండ్ కింద వాడొచ్చని, కన్స్ట్రక్షన్ వర్కర్ల కోసం ఈ డబ్బులను ఉపయోగించొచ్చని వివరించారు.
ఇండియాలో 60 ఏళ్లు దాటిన వారి సంఖ్య 2036 నాటికి 22.7 కోట్లకు చేరుకుంటుందని అంచనా. ఇది దేశ మొత్తం జనాభాలో 15 శాతానికి సమానం. ఈ నెంబర్ 2050 నాటికి 34.7 కోట్లకు పెరిగే అవకాశం ఉంది. యూఎస్, కెనడా, యూరప్, రష్యా, చైనా దేశాలు సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్ను అందిస్తున్నాయి. పెన్షన్తో పాటు, హెల్త్ బెనిఫిట్స్, అన్ఎంప్లాయీమెంట్ ఇన్సూరెన్స్ అందిస్తున్నాయి. ఇండియా మాత్రం ప్రావిడెంట్ ఫండ్ సిస్టమ్ ద్వారా పెన్షన్ అందిస్తోంది.
తక్కువ ఆదాయం ఉన్నవారికి హెల్త్ ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తోంది. యూనివర్సల్ పెన్షన్ స్కీమ్ కింద అందరికీ సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్ అందించాలని కేంద్రం భావిస్తోంది.