- ఒక్కో ప్లాంట్ కు 0.5 నుంచి 2 మెగావాట్ల వరకు అవకాశం
- జిల్లాకో వంద మెగావాట్లు కేటాయింపు
- టీజీ రెడ్కో ఆధ్వర్యంలో ఏర్పాటుకు కసరత్తు చేస్తున్న ప్రభుత్వం
- అన్నదాతల ఆదాయం పెంచేలా సర్కారు చర్యలు
హనుమకొండ, వెలుగు: రైతుల భూముల్లో ఇక నుంచి సోలార్ పంట పండనుంది. ఇప్పటికే మహిళా సంఘాలకు ఆర్థిక చేయూతనిచ్చేందుకు సోలార్ పవర్ప్లాంట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వం, అన్నదాతలకు కూడా ఆ అవకాశాన్ని కల్పిస్తోంది. రైతులకు సంబంధించిన బంజరు భూములు, సాగుకు యోగ్యంగా లేని ల్యాండ్లో 'సోలార్పవర్ప్లాంట్లు' ఏర్పాటు చేసుకునేలా ఎంకరేజ్చేస్తోంది. ఔత్సాహికుల నుంచి దరఖాస్తులు కూడా స్వీకరిస్తోంది. కేంద్ర ప్రభుత్వ పీఎం కుసుమ్ స్కీం కింద సోలార్ పవర్ ప్లాంట్లను అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టింది. ఈ సోలార్ప్లాంట్ల ద్వారా ఉత్పత్తి అయ్యే సౌర విద్యుత్తును ఈఆర్సీ నిబంధనల మేరకు రైతుల నుంచి ప్రభుత్వమే కొనుగోలు చేయనుంది. ఇప్పటికే ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో సోలార్ప్లాంట్ల ఏర్పాటుకు చర్యలు ప్రారంభమయ్యాయి.
జిల్లాకో వంద మెగావాట్లు..!
కేంద్ర ప్రభుత్వ 'ప్రధానమంత్రి కిసాన్ఊర్జ సురక్షా ఏవం ఉత్థాన్మహాభియాన్(పీఎం కుసుమ్)'లో భాగంగా రాష్ట్ర సర్కారు సోలార్ కరెంట్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తోంది. తెలంగాణ రిన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్కార్పొరేషన్(టీజీ రెడ్కో)ను నోడల్ఏజెన్సీగా నియమించి, సోలార్ విద్యుత్తు వైపు అడుగులు వేస్తోంది. రాష్ట్రంలో 4 వేల మెగావాట్ల సోలార్విద్యుత్తును తయారు చేసేందుకు ప్లాన్రెడీ చేయగా, అందులో వెయ్యి మెగావాట్లను మహిళా సంఘాలకు అప్పగించింది. మిగతా 3 వేల మెగావాట్లు ఉత్పత్తి చేసే ప్లాంట్లను రైతుల పడావు భూముల్లో ఏర్పాటు చేయనుంది.
సగటున జిల్లాకు వంద మెగావాట్ల చొప్పున కేటాయించింది. ఈ లెక్కన ఉమ్మడి వరంగల్ జిల్లాలో 600 మెగావాట్ల సోలార్ పవర్ జనరేట్చేసేందుకు కసరత్తు చేస్తోంది. ఇప్పటికే హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలకేంద్రాన్ని పైలట్ప్రాజెక్టుగా ఎంపిక చేయగా, లీడర్లు, ఆఫీసర్లు స్థలాన్ని పరిశీలించారు. మిగతా జిల్లాల్లో కూడా పైలట్ప్రాజెక్టుగా గ్రామాలను ఎంపిక చేసిన సోలార్ప్లాంట్లు పెట్టనున్నట్లు అధికారులు చెబుతున్నారు.
సాగుకు యోగ్యంగా లేని భూముల్లో..
రైతులు సాగు చేయకుండా వదిలేసిన బంజరు భూముల్లో సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసి, దానితో అన్నదాతలకు ఆదాయం పెంచేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఒక్కో చోట 500 కిలోవాట్ల నుంచి 2 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసేలా ప్యానెల్స్ను ఏర్పాటు చేయనుండగా, ఒక మెగావాట్విద్యుత్తు ఉత్పత్తికి మూడున్నర నుంచి నాలుగెకరాల భూమి అవసరం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. రైతులు వీటిని ఏర్పాటు చేసుకోవడానికి ప్రభుత్వం లోన్ సౌకర్యం కల్పించనుండగా, ఈఆర్సీ టారిఫ్ మేరకు కిలోవాట్పవర్ను రూ.3.13 చెల్లించి ప్రభుత్వమే కొనుగోలు చేయనుంది.
అంతేగాకుండా 25 ఏండ్ల పాటు డిస్కంలే ఈ పవర్ను కొనుగోలు చేయనున్నాయి. ఇదిలాఉంటే 33/11 కేవీ సబ్స్టేషన్కు దగ్గరగా ఉంటే విద్యుత్ రవాణాకు లైన్ ఖర్చులు తక్కువగా ఉంటాయి. రూల్స్ ప్రకారం అర్హులైన రైతులు 'www.tgredco.telangana.gov.in' వెబ్సైట్ లో అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది. కాగా, సోలార్ప్లాంట్ల ఏర్పాటు విషయంలో జనాలకు వివరాలు అందించి, అవగాహన కల్పించాల్సిన రెడ్ కో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
22వ తేదీలోగా దరఖాస్తు చేసుకోండి..
రైతుల ఆదాయం పెంచడంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. అందులో భాగంగానే సోలార్ప్లాంట్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. అర్హత ఉన్న రైతులు, రైతు సంఘాలు, డెవలపర్స్ఎవరైనా ఈ నెల 22వ తేదీలోగా రెడ్కో వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అనంతరం ప్రభుత్వ నిబంధనల మేరకు సోలార్ ప్లాంట్లు సాంక్షన్అయ్యే అవకాశం ఉంటుంది.
- ఏ.విజేందర్రెడ్డి, డీఈ, హనుమకొండ