
- ఆదివాసీ దత్తత గ్రామంలో పర్యటించిన గవర్నర్
- స్వాగతం పలికిన మంత్రి సీతక్క, ఆఫీసర్లు
జయశంకర్ భూపాలపల్లి/తాడ్వాయి/ములుగు, వెలుగు: కొండపర్తి మిర్చి పౌడర్ను బాగా ఫేమస్ చేయాలని, గుజరాత్ రాష్ట్రంలో అమూల్ మాదిరిగా కొండపర్తిలో మహిళలు తయారుచేసే కారం, పసుపు, మసాలాకు అంతటి పేరు ప్రఖ్యాతులు తేవాలని గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ పేర్కొన్నారు. దేశానికి కొండపర్తి గ్రామం మోడల్ కావాలన్నారు. ములుగు జిల్లాలో దత్తత తీసుకున్న కొండపర్తి గ్రామంలో మంగళవారం గవర్నర్ పర్యటించారు.
కుమ్రంభీం, బిర్సాముండా విగ్రహాలను, డిజిటల్ తరగతులను, అంగన్వాడీ కేంద్రాన్ని, మసాలా యూనిట్, కుట్టు మిషన్ యూనిట్ ను గవర్నర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ కొండపర్తి చిన్న గ్రామమైన అభివృద్ధిలో ఆదర్శంగా నిలవాలన్నారు. అటవీ ప్రాంతంలోని గ్రామంలో డిజిటల్ క్లాసులు ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. ఇక్కడ స్టూడెంట్స్ ఇంగ్లీషు బాగా మాట్లాడుతున్నారని అభినందించారు. కొండపర్తి పండించే మిర్చి పౌడర్ ను రాష్ట్రమంతా మార్కెట్ చేయాలన్నారు. ఆదివాసీల అభివృద్ధికి తాను, రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు.
రోడ్డు లేని గ్రామాన్ని దత్తత తీసుకున్నారు..
ములుగు జిల్లాలో దట్టమైన అడవిలో సరైన రోడ్డు కూడా లేని కొండపర్తి గ్రామాన్ని గవర్నర్ దత్తత తీసుకున్నారని మంత్రి సీతక్క తెలిపారు. మహిళల ఆర్థికాభివృద్ధిలో కొండపర్తి రోల్ మోడల్ కావాలన్నారు. ఇక్కడి మహిళలు వ్యాపారవేత్తలుగా ఎదగాలని, సాగుకు చేయూత అందించేందుకు గవర్నర్ ఏడు బోర్లు మంజూరు చేశారన్నారు.
40 పరిశ్రమలు, దిశా స్వచ్ఛంద సంస్థ సహకారంతో 100 పాఠశాలలను దత్తత తీసుకున్నామని తెలిపారు. గవర్నర్కు ములుగులో మంత్రి సీతక్క, కలెక్టర్ దివాకర టీఎస్, ఎస్పీ డాక్టర్ పి.శబరీశ్, ఐటీడీఏ పీవో చిత్రా మిశ్రా, డీఎఫ్వో రాహుల్ కిషన్ జాదవ్, లైబ్రరీ చైర్మన్ బానోతు రవిచందర్ బొకేలు అందజేసి ఘనంగా స్వాగతం పలికారు. గట్టమ్మ సమీపంలోని ఆర్అండ్బీ గెస్ట్హౌస్లో మంత్రి సీతక్కతో నియోజకవర్గంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై కొద్దిసేపు చర్చించారు.
వనదేవతలను దర్శించుకున్న గవర్నర్
కొండపర్తి పర్యటన అనంతరం గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మేడారం సమ్మక్క సారలమ్మను దర్శించుకున్నారు. ఆయన వెంట మంత్రి సీతక్క ఉన్నారు. గవర్నర్ కు ఎండోమెంట్ అధికారులు, పూజారులు ఘన స్వాగతం పలికారు. ఆయన వన దేవతలకు నిలువెత్తు బంగారం సమర్పించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.