
- నేడు టీచర్ల సీనియారిటీ, వేకెన్సీ లిస్ట్ విడుదల
- గతంలో బదిలీ అయిన 193 మంది ఎస్ఏలు రిలీవ్
- జిల్లాలో టీచర్ పోస్టుల ఖాళీలు పెరిగే అవకాశం
మంచిర్యాల, వెలుగు : చాలాకాలం తర్వాత విద్యాశాఖలో ట్రాన్స్ఫర్లు, ప్రమోషన్లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నెల 8 నుంచి 22 వరకు 15 రోజుల్లోగా ఈ ప్రక్రియను పూర్తిచేయాలని ఆదేశించింది. ఈ మేరకు జిల్లా విద్యాశాఖ అధికారులు కసరత్తు మొదలుపెట్టారు. గత సెప్టెంబర్లో బీఆర్ఎస్ ప్రభుత్వం ట్రాన్స్ఫర్లు, ప్రమోషన్లు చేపట్టింది. అయితే ఎలక్షన్ కోడ్ కారణంగా అప్పుడు అర్ధాంతరంగా బ్రేక్ పడ్డది. ప్రస్తుత సర్కారు దానికి కొనసాగింపుగా టీచర్ల ట్రాన్స్ఫర్లు, ప్రమోషన్లకు షెడ్యూల్ రిలీజ్ చేసింది. ఈ నెల 22 లోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో మళ్లీ విద్యాశాఖలో సందడి మొదలైంది.
నేడు సీనియారిటీ లిస్ట్ రిలీజ్
ప్రమోషన్ల ప్రక్రియ పూర్తిచేసిన తర్వాత ట్రాన్స్ఫర్లు చేపట్టనున్నారు. ఈ మేరకు జిల్లా విద్యాశాఖ అధికారులు ప్రమోషన్లు, ట్రాన్స్ఫర్లకు అర్హత గల సెకండరీ గ్రేడ్ టీచర్లు (ఎస్జీటీలు), స్కూల్ అసిస్టెంట్ల (ఎస్ఏ) సీనియారిటీ లిస్టులు రెడీ చేసి ఆదివారం రిలీజ్చేయనున్నారు. అనంతరం సీనియారిటీ లిస్టులపై 10,11 తేదీల్లో టీచర్ల నుంచి డీఈవో అభ్యంతరాలను స్వీకరించనున్నారు. గత సెప్టెంబర్లోనే సీనియారిటీ లిస్ట్ ప్రకటించినప్పటికీ ఆ తర్వాత పలువురు రిటైర్కావడంతో పాటు వివిధ కారణాలతో కొన్ని మార్పులు జరిగే అవకాశం ఉంది. దీంతో సీనియారిటీ లిస్టును సవరించి రిలీజ్చేయనున్నారు.
రిలీవ్ అయిన స్కూల్ అసిస్టెంట్లు
గత సెప్టెంబర్లో చేపట్టిన బదిలీల్లో 352 మంది స్కూల్అసిస్టెంట్లకు అవకాశం లభించింది. ఇందులో లోకల్ బాడీస్ స్కూళ్లలో 322 మంది, గవర్నమెంట్ స్కూళ్లలో 30 మంది ట్రాన్స్ఫర్ అయ్యారు. ఎస్జీటీల కోర్టు కేసు పెండింగ్లో ఉండడం వల్ల కొంతమంది స్కూల్ అసిస్టెంట్లకు బదిలీఅయిన స్థానాల్లో పోస్టింగ్ ఇవ్వలేదు. దీంతో వారు గత 8 నెలలుగా అదే స్థానాల్లో పనిచేస్తున్నారు. తాజా బదిలీల నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా పెండింగ్ ఉన్న 193 మంది స్కూల్అసిస్టెంట్లను శనివారం రిలీవ్ చేశారు. వెంటనే వారు బదిలీ అయిన స్థానాల్లో రిపోర్ట్ చేశారు.
పెరగనున్న ఖాళీలు..
ప్రమోషన్లు, ట్రాన్స్ఫర్లతో జిల్లాలో భారీగా టీచర్ పోస్టుల ఖాళీలు ఏర్పడే అవకాశముంది. జిల్లాలోని గవర్నమెంట్, లోకల్ బాడీస్ స్కూళ్లలో కలిపి 2839 పోస్టులు సాంక్షన్ కాగా, ప్రస్తుతం 2347 మంది పనిచేస్తున్నారు. ఇందులో 492 వేకెన్సీలను గుర్తించారు. నిరుడు సెప్టెంబర్ తర్వాత పలువురు టీచర్లు రిటైర్ కావడం, చనిపోవడం వల్ల ప్రస్తుతం ఖాళీల సంఖ్య పెరిగే చాన్స్ ఉంది. మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ల నుంచి ఖాళీల వివరాలను తీసుకుంటున్నారు. సీనియారిటీతో పాటు వేకెన్సీ లిస్టును ఆదివారం ప్రకటిస్తామని డీఈవో యాదయ్య తెలిపారు.