న్యూఢిల్లీ: ఏసీలు, ఎల్ఈడీ టీవీలు వంటి వైట్ గూడ్స్ తయారీ కంపెనీలు పీఎల్ఐ కింద ఇన్వెస్ట్ చేసేందుకు ప్రభుత్వం అప్లికేషన్ విండోని మరో 90 రోజుల పాటు ఓపెన్లో ఉంచనుంది. డిమాండ్ బాగుండడంతో థర్డ్ రౌండ్లో భాగంగా అప్లికేషన్లను స్వీకరిస్తున్నామని కామర్స్ మినిస్ట్రీ పేర్కొంది. వైట్ గూడ్స్ సెక్టార్లో ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (పీఎల్ఐ) కింద ఇన్వెస్ట్ చేయాలనుకునే కంపెనీలు జులై 15 నుంచి అక్టోబర్12 మధ్య అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఇప్పటికే బెనిఫిట్స్ అందుకుంటున్న కంపెనీలు కూడా హయ్యర్ సెగ్మెంట్కు మారాలనుకుంటే కొత్తగా అప్లికేషన్ పెట్టుకోవచ్చు.
వైట్ గూడ్స్ సెక్టార్లో పీఎల్ఐ కింద పెట్టుబడులు పెట్టేందుకు వివిధ కంపెనీల నుంచి 66 అప్లికేషన్లు అందాయని, రూ.6,962 కోట్లు ఇన్వెస్ట్ చేసేందుకు కంపెనీలు ముందుకొచ్చాయని కామర్స్ మినిస్ట్రీ పేర్కొంది. థర్డ్ రౌండ్లో అర్హత సాధించిన కొత్త అప్లికేషన్లు, హయ్యర్ సెగ్మెంట్లో ఇన్వెస్ట్ చేయాలనుకునే పాత అప్లికేషన్లు మిగిలిన పీఎల్ఐ స్కీమ్ టెన్యూర్ మూడేళ్లకు మాత్రమే రాయితీలు పొందగలుగుతాయి. కాగా, వైట్ గూడ్స్ సెక్టార్లో పీఎల్ఐ స్కీమ్ 2021–22 నుంచి 2028–29 వరకు అందుబాటులో ఉంటుంది. రూ. 6,238 విలువైన రాయితీలను ఏడేళ్లలో ప్రభుత్వం అందించనుంది. ఈ స్కీమ్ను 2021 ఏప్రిల్లో ప్రకటించారు.